2023 నవంబర్ 19వ తేదీని భారత క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరిచిపోలేరు. టోర్నీ ఆద్యంతం సత్తాచాటిని టీమిండియా ఆ రోజు జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది. ఆఖరి మెట్టుపై బోల్తా పడి వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకుంది. అయితే అంతకుముందు జరిగిన 2019 వరల్డ్ కప్లోనూ భారత అభిమానులకు జులై 10న హార్ట్ బ్రేక్ అయ్యింది.
సరిగ్గా అయిదేళ్ల క్రితం ఉత్కంఠ భరితంగా సాగిన న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ సెమీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. రాస్ టేలర్ (74; 90 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), కేన్ విలియమ్సన్ (67; 95 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్లు. భువనేశ్వర్ మూడు వికెట్లు తీశాడు.

అయితే ఛేదన ఆరంభించిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్. అయిదు పరుగులకే టాప్ ఆర్డర్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పెవిలియన్ చేరారు. ముగ్గురు ఒక్క పరుగుకే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఇన్నింగ్స్ చక్కదిద్దాడానికి ప్రయత్నించినా, కివీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు సాధించారు. దీంతో 92/6తో టీమిండియా ఓటమి అంచుల్లో నిలిచింది.
ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు ఏడో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జడేజా ఔటైనప్పటికీ ధోనీ క్రీజులో ఉండటంతో భారత్ సెమీస్ చేరుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. కానీ మార్టిన్ గప్తిల్ వేసిన బుల్లెట్త్రోతో ధోనీ రనౌటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా ఓటమి ఖరారైంది.
అయితే ధోనీని రనౌట్ చేసిన గప్తిల్పై కొందరు టీమిండియా అభిమానులు తీవ్రంగా ద్వేషం పెంచుకున్నారు. గప్తిల్ను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ దూషించారు. దూషిస్తూ మెయిల్స్ వస్తున్నాయని గప్తిల్ గతేడాది కూడా పేర్కొన్నాడు. అయితే ధోనీ రనౌట్కు ఇవాళతో సరిగ్గా అయిదేళ్లు కావడంతో గప్తిల్ మరోసారి దీని గురించి స్పందించాడు. 'నేను ఎందుకు ఇంత ద్వేషాన్ని పొందుతున్నానో నాకు ఇవాళ తెలిసింది' అంటూ ధోనీ రనౌట్ ఫొటోలను షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు.