విశాఖపట్నం: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఐదో వన్డేకి విశాఖపట్నం ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విశాఖపట్నం వన్డే అక్కడ నుంచి తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు పిచ్పై తీవ్ర ప్రభావం చూపిన కారణంగా వన్డే మ్యాచ్కు పిచ్ అనుకూలంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ప్రస్తుతం అసోం, రాజస్థాన్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది.
ఈ మ్యాచ్లో భాగంగా మూడో రోజే 17 వికెట్లు పడటం గమనార్హం. పిచ్ పరిస్థితిపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు సైతం స్పందించారు. ఈ పిచ్ను కొత్తగా తయారు చేశారని, అయితే భారీ వర్షాల కారణంగా అది పూర్తిగా సిద్ధం కాలేదని ఆయన చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తన కథనంలో ప్రచురించింది.
'నాలుగు నెలల కిందటే ఈ పిచ్ను వేశారు. అయితే వర్షాల కారణంగా పూర్తిగా సిద్ధం కాలేదు. బీసీసీఐ పిచ్ను పరిశీలించడానికి బుధవారం ఓ క్యూరేటర్ను పంపిస్తోంది. ఆయనే పిచ్ను పరిశీలించి.. అది వన్డే మ్యాచ్కు పనికి వస్తుందా లేదా అన్నది నిర్ణయిస్తారు' అని ఆయన అన్నారు.
బీసీసీఐ పంపిన క్యూరేటర్ పిచ్ వన్డే మ్యాచ్కు అనుకూలంగా ఉందా లేదా? అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. పిచ్ గనుక ఫిట్గా లేకపోతే వన్డే మ్యాచ్ మరో వేదికకు తరలిపోతుంది. అయితే విశాక పిచ్ విషయం తమ దృష్టికి ఇంకా రాలేదని, వన్డే మ్యాచ్ నిర్వహించడానికి ఐదు నుంచి ఆరు వేదికలు స్టాండ్ బైలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని బోర్డు సెక్రటరీ అజయ్ షిర్కే తెలిపారు.
పిచ్ మరీ నెమ్మదిగా ఉన్న విషయాన్ని తొలుత అసోం కోచ్ సునీల్ జోషి లేవనెత్తాడు. కొన్ని బంతులైతే మరీ మడమ ఎత్తుకు కూడా రావడం లేదని ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ నెల చివరన జరగనున్న వన్డే మ్యాచ్ కోసం పిచ్ను తయారు చేస్తున్నారని తెలిపాడు.
ఇందులో భాగంగా పిచ్కు ఎక్కువ నీళ్లు పట్టడం వల్ల మరీ నెమ్మదిగా మారిందని, తొలి రెండు రోజులు మరీ మందకొడిగా ఉన్న పిచ్ మూడోరోజు బౌన్స్తో దారుణంగా తయారైందని జోషీ వెల్లడించాడు.