వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు:
ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలోనే ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 'Cancel IPL' అనే హ్యాష్ ట్యాగ్ను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంచైజీ అధికారులు స్పందించారు. 'ఇప్పటికే సగం సీజన్ పూర్తయింది. ఇక మధ్యలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇద్దరు కోల్కతా ఆటగాళ్లు వైరస్ బారిన పడటం అనేది బీసీసీఐకి పెను సవాలుగా మారింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ ఆటగాడిని బయోబబుల్ నుంచి బయటకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. దాంతో అతడికి పాజిటివ్గా తేలిందని తెలిసింది. ఆటగాళ్లంతా బీసీసీఐ నిర్దేశించిన కచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదు' అని ఓ ఫ్రాంచైజీ అధికారి అన్నారు.
ఎంతకాలం వాయిదా వేస్తారు:
'ఒకవేళ ఐపీఎల్ 2021ని వాయిదా వేసినా.. ఎంతకాలం చేస్తారు?. ఈ సీజన్ సజావుగా సాగాలంటే పాజిటివ్గా తేలిన వాళ్లను ఐసోలేషన్లో ఉంచాలి. మరోవైపు యథావిధిగా మ్యాచ్లు నిర్వహించాలి. కరోనా నేపథ్యంలో సహజంగానే ఆటగాళ్లంతా ఆందోళన చెందుతారు. ఇప్పుడైతే టోర్నీ పూర్తయ్యాక ఇళ్లకు ఎలా వెళ్లాలనేదానిపై సందిగ్ధంలో పడ్డారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటుంది. విదేశీ ఆటగాళ్లకు కూడా ప్రత్యామ్యాయం చూస్తుంది' అని మరో ఫ్రాంఛైజీ అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో బీసీసీఐ ఏది మంచిదైతే అది చెయ్యాలని, అనవసరంగా అనేక అభిప్రాయాలు రుద్దరాదని మరో ప్రాంచైజీ అధికారి సూచించారు.
చెన్నై జట్టులో కరోనా కేసులు లేవు:
కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడినట్లు ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో దీంతో సోమవారం రాత్రి ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఇది తెలిసిన గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ మూడు కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఢిల్లీ మైదాన సిబ్బందిలో ఐదుగురికి కూడా కరోనా సోకడం కంగారు పెడుతోంది. దీంతో మంగళవారం ఢిల్లీలో జరిగే సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచుపైనా సందిగ్ధం నెలకొంది. మ్యాచ్ జరిగేది లేనిది రేపు ఉదయంలోగా తేలనుంది.
ఐపీఎల్ అవసరమా:
మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ 2021ను ఆపితేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ... 'బయో బబుల్లో ఐపీఎల్ను జరుపుతున్నారు కాబట్టి కరోనా ఎఫెక్ట్ ఉండదనే ముందు అనుకున్నా. క్రికెటర్లంతా సేఫ్గానే ఉంటారని భావించా. కానీ దురదృష్టవశాత్తూ బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నా.. క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. అంటే రక్షణ లేదనేది ఇక్కడ అర్థమవుతోంది. రాబోవు కాలంలో పరిస్థితులు కఠినంగా ఉండవచ్చు. మరి ఈ తరుణంలో ఐపీఎల్ అవసరమా. ఇక ఆపండి' అని అన్నారు.