
స్పందించిన అంతర్జాతీయ ప్రముఖులు:
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్, పోర్న్ స్టార్ మియా ఖలిఫా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హారిస్లు రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే అంతర్జాతీయ ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలపడంతో.. బీజేపీ మద్దతుదారులతో పాటు మన దేశ క్రీడా, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని, తమ దేశ సమస్యలను తాము పరిష్కరించుకోగలమని పేర్కొన్నారు. #Indiatogether అనే హాష్ ట్యాగ్స్ను ట్రెండ్ చేశారు.

సచిన్, కోహ్లీ ఏమన్నారంటే?:
'భారతదేశ సార్వభౌమత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు. బయటి వ్యక్తులు (బాహ్య శక్తులు) కేవలం ప్రేక్షకులు మాత్రమే. ఇక్కడి వ్యవహారాల్లో వారు భాగస్వాములు కాలేరు. భారత్ ఏంటో భారతీయులకు తెలుసు. భారతీయులు మాత్రమే భారత్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి' అని సచిన్ ట్వీట్ చేశారు. 'రైతు ఉద్యమంపై భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం ఐకమత్యంగా ఉందాం. రైతులు మన దేశంలో అంతర్భాగం. వారు దేశానికి వెన్నెముక. ఈ సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. దేశంలో శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీలు కృషి చేస్తాయని ఆశిస్తున్నా' అని కోహ్లీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. కోహ్లీ ప్రస్తుతం చెన్నైలో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు.

ట్వీట్లపై దర్యాప్తు:
ప్రముఖుల ట్వీట్లు దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్రానికి మద్దతు ప్రకటించడాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలతో సహా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాజ్ ఠాక్రే సైతం ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒత్తిడితోనే సచిన్, కోహ్లీ, మంగేష్కర్, అక్షయ్ వంటి వారు ఈ ట్వీట్స్ చేశారని పలువురు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్తో ఆరోపించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖులు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేస్తామని పేర్కొంది.

పార్లమెంట్ నుంచి పిలుపు:
రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్నదాతలు తమ ఆందోళన విరమించి చర్చలకు రావాలని పార్లమెంట్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికిన నేపథ్యంలో రైతు సంఘాలు తాజాగా స్పందించాయి. తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు అనువైన తేదీ ప్రభుత్వమే నిర్ణయించాలని రైతు సంఘాల నాయకులు తెలిపారు. నూతన సాగు చట్టాలపై కేంద్రం, ప్రభుత్వం మధ్య ఇప్పటివరకు 11 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జరిగిన చర్చల్లో చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు నిలిపివేస్తామని, రైతుల అభ్యంతరాలకు అనుగుణంగా సవరణలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలను రైతు సంఘాల నాయకులు తిరస్కరించారు. సాగు చట్టాలను సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మ్యాచ్ను మలుపు తిప్పిన కొత్తబంతి.. దక్షిణాఫ్రికా ఢమాల్! 18 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన పాక్!


Click it and Unblock the Notifications
