
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. టాప్ బ్యాటర్లంతా ఏమాత్రం ప్రభావం చూపకుండానే చేతులెత్తేశారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (31) ఓ మోస్తరు బ్యాటింగ్ చేశాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో పక్క చూడచక్కని బ్యాటింగ్ ఆడాడు. ఎక్కువ రిస్కులు తీసుకోకుండా.. చాలా సేఫ్గా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే రాహుల్, పాండ్యా అవుటైన తర్వాత కోహ్లీపై ఒత్తిడి మరింత పెరిగింది.
మ్యాచ్లో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. ఎడాపెడా వికెట్లు తీసేస్తూ భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే అతన్ని కోహ్లీ సమర్ధవంతంగానే ఎదుర్కొన్నాడు. కానీ కెరీర్లో మూడో వన్డే ఆడుతున్న నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఎల్లీస్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ట్రై చేసిన కోహ్లీ.. అది స్ట్రెయిట్గా రావడంతో మిస్సయ్యాడు. దీంతో అది వెళ్లి కోహ్లీ ప్యాడ్లను తాకింది. అప్పటికే రాహుల్ ఒక రివ్యూ తీసుకోవడంతో భారత్ వద్ద ఒక్క రివ్యూ మాత్రమే మిగిలింది. ఇలాంటి సమయంలో రివ్యూ వేస్ట్ చేయడం ఇష్టం లేని కోహ్లీ నిరాశగా మైదానం వీడాడు.
అనంతరం వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత జట్టు 117 పరుగులకే ఆలౌట్ అయింది. కోహ్లీనే భారత జట్టులో టాప్ స్కోరర్. కానీ అతను అవుటైన విధానం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. తొలి వన్డేలో కూడా దాదాపు ఇలాంటి షాటే ఆడబోయిన కోహ్లీ ఎల్బీడ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇప్పుడు మళ్లీ క్రాస్ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఇది చూసిన నిపుణులు కోహ్లీ ఇలా అవుటవడం కొంత ఆందోళనకరమైన విషయం అని అంటున్నారు. మరి ఈ సమస్యను కోహ్లీ అధిగమించి మూడో వన్డేలో రాణిస్తాడేమో చూడాలి.