
సరిగ్గా ఆరు నెలల క్రితం వరకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్ లేక బాధ పడుతున్న అతన్ని భారత జట్టులో నుంచి పక్కకు తప్పించాలని కొందరు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాంటి సమయంలో ఆసియా కప్ ముందు కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్న కోహ్లీ.. మళ్లీ ఫ్రెష్గా కనిపించాడు. ఆ టోర్నీ నుంచే మళ్లీ గాడిన పడినట్లు ఆడటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వరుసగా మూడు ఫార్మాట్లలో భారీ సెంచరీలు కూడా సాధించాడు.
దీంతో కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడని అభిమానులు చాలా సంతోషించారు. ఇదే విషయాన్ని కోహ్లీ కూడా ధ్రువీకరించాడు. 'నేను ఎలా ఆడతానో మళ్లీ అలా ఆడటం మొదలుపెట్టా. అయితే ఇంకా నా బెస్ట్ ఆటకు చేరుకోలేదని అనుకుంటున్నా. ఈ ఐపీఎల్లో అది జరుగుతుందని ఆశిస్తున్నా. నేను ఏ స్థాయిలో ఆడాలని అనుకుంటున్నానో.. ఆ స్థాయికి నా ఆట చేరి, జట్టుకు సాయం చేస్తే చాలా సంతోషిస్తా' అని చెప్పుకొచ్చాడు. ఆట నుంచి బ్రేక్ తీసుకోవడం తనకు చాలా బాగా కలిసొచ్చిందని చెప్పాడు.
'ఈ ఆట పట్ల నా ప్రేమ మళ్లీ చిగురించడమే కావలసింది. మైదానంలో చాలా కాలంగా జరుగుతున్న విషయాలకు దూరంగా వెళ్లిన తర్వాాతే అది సాధ్యమైంది. నేను బాగా అలసిపోయా. మళ్లీ నాతో నేను ఒక మనిషిగా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. నన్ను నేను జడ్జ్ చేసుకుంటూ, విమర్శించుకుంటూ ఉండటం సరికాదని అర్థమైంది' అని కోహ్లీ వివరించాడు. అలాగే మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఆడటం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పాడు. అంతేకాదు, ఇక్కడ ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని అభిమానులకు హింటిచ్చాడు. దీంతో ఈ సర్ప్రయిజ్ ఏమై ఉంటుందా? అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.