భారత క్రికెట్ అభిమానులకు షాకిచ్చే వార్త. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టు.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ను వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించిందట. దీనికి ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 23 నుంచి 30 వరకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ వాయిదా వల్ల టీమిండియా ఆటగాళ్లకు రెస్ట్ దొరుకుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న భారత జట్టు.. ఈ ఆఫ్ఘన్ సిరీస్ వాయిదా పడటంతో వెస్టిండీస్తో ఆడనుంది.

అయితే ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆఫ్ఘన్ సిరీస్ లేకపోవడంతో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ ఫైట్ మరోసారి చూద్దామని అనుకున్న ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. ఐపీఎల్ సమయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బీసీసీఐకి సంబంధించిన కొందరు కూడా ఒప్పుకున్నారు.
'డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కొంత బ్రేక్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ను మధ్యలో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రస్తుతం బ్రాడ్కాస్టర్ డీల్ చేయడం కూడా కష్టంగా కనిపిస్తోంది. వెస్టిండీస్ టూర్ కూడా ఉంది కదా. కాబట్టి ఇది ఆటగాళ్లకు కూడా విశ్రాంతి దొరుకుతుంది' అని ఒక సీనియర్ బీసీసీఐ ఆఫీసర్ చెప్పారు.
అయితే ఆఫ్ఘనిస్తాన్, భారత్ టూర్ ఎందుకు వాయిదా వేశారో రెండు బోర్డులు ఇంకా వివరణ ఇవ్వలేదు. మళ్లీ ఈ సిరీస్ ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారో కూడా తెలియడం లేదు. అదే జరిగితే మళ్లీ 'మ్యాంగో వార్' చూస్తామని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ సిరీస్ జరగకపోతే.. వచ్చే ఆసియా కప్లోనే ఈ రెండు జట్లు తలపడటం చూస్తాం.