
వాతావరణం ఎలా ఉందంటే?
గువాహతిలో వాతావరణం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించదని తెలుస్తోంది. అయితే ఇక్కడ వర్షం పడే అవకాశం ఆరు శాతం ఉందట. మ్యాచ్ సమయంలో అత్యధికంగా 26 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సమాచారం. వాతావరణంలో 71-93 శాతం వరకు తేమ ఉంటుంది. మ్యాచ్లో మంచు ప్రభావం పెద్దగా చూపకపోవచ్చని అంటున్నారు. అయితే ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లకు ఇది కొంత సమస్య సృష్టించే అవకాశం ఉంది.

బ్యాటింగ్కు స్వర్గధామం
బార్సాపరా మైదానంలోని పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనుంది. బౌలర్లకు కొద్దోగొప్పో సహకారం లభించినప్పటికీ బ్యాటర్లే ఇక్కడ రాణిస్తారు. ఈ స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంటుంది. ఇంతకుముందు ఇక్కడ మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచులు, ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. ఇక్కడ జరిగిన మ్యాచులన్నింటిలో భారీ స్కోర్లు నమోదవడం గమనార్హం. అంతేకాదు ఇక్కడ జరిగిన ఏకైక వన్డే మ్యాచ్లో వెస్టిండీస్, భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ నిర్దేశించిన 323 పరుగుల భారీ స్కోరును టీమిండియా ఛేదించేసింది.

రోహిత్, కోహ్లీకి కలిసొచ్చిన మైదానం
టీమిండియా సారధి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ మైదానం బాగా కలిసొచ్చింది. ఇక్కడ భారత జట్టు చివరగా ఆడిన వన్డే మ్యాచ్లో టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో కోహ్లీ ఆడుతున్నాడు. వెస్టిండీస్తో జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ 152 పరుగులతో అజేయంగా నిలవగా.. కోహ్లీ కూడా 140 పరుగుల భారీ స్కోరు సాధించాడు. దీంతో వీళ్లిద్దరూ మరోసారి ఇక్కడ అప్పటి మ్యాజిక్ రిపీట్ చేస్తారని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications












