
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ కోన భరత్ మరోసారి విఫలమయ్యాడు. అనూహ్యంగా టర్న్ అవుతున్న పిచ్పై బంతిని సరిగా అంచనా వేయలేక పెవిలియన్ చేరాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. టాపార్డర్లో గిల్, మిడిలార్డర్లో కోహ్లీ మాత్రమే 20 పరుగుల మార్కు దాటారు. మిగతా వాళ్లలో రోహిత్ (12) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో ఒక దశలో 45 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును భరత్ (17), కోహ్లీ (22) ఆదుకున్నారు.
వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించారు. కానీ టాడ్ మర్ఫీ బౌలింగ్లో కోహ్లీ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే లియాన్ బౌలింగ్లో భరత్ కూడా అవుటయ్యాడు. లియాన్ వేసిన బంతి తనకు దూరంగా వెళ్తుందని భావించిన భరత్.. ముందుకొచ్చి డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు.
కానీ బంతి టర్న్ అయి అతని ప్యాడ్లను తాకింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు అప్పీల్ చేసినా అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో కొంత ఆలోచించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి ఏమాత్రం బ్యాటును తాకలేదని తేలింది. అలాగే వికెట్లను కూలుస్తున్నట్లు కనిపించింది.
దీంతో భరత్ కూడా 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు. రాహుల్ను తీసేసినట్లే భరత్ను కూడా తర్వాతి మ్యాచులో ఆడించకూడదని, అతని స్థానంలో ఇషాన్ కిషన్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భరత్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కూడా భరత్ విఫలమైతే చివరి టెస్టులో అతన్ని ఆడించరేమో? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.