
ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో మంచి ఫామ్ చూపించిన కోహ్లీ.. అదే ఫామ్ ను టెస్టులో కొనసాగించలేక పోయాడు. కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని వెనుదిరిగాడు. దీంతో అభిమానులు కోహ్లీపై సెటైర్ లు వేస్తున్నారు. డెడ్ రబ్బర్ మ్యాచులు, డ్రాప్ క్యాచులు లేకపోతే కోహ్లీ పరుగులు చెయ్యలేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ చేసింది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన డెడ్ రబ్బర్ మ్యాచులో అన్న సంగతి తెలిసిందే. దానికితోడు ఆ మ్యాచులో కోహ్లీ ఇచ్చిన సులభమైన క్యాచును ఆఫ్ఘన్ ఫీల్దర్లు జారవిడిచారు. తాజాగా బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో కూడా కోహ్లీ శతకం చేశాడు. కానీ ఆ మ్యాచులో కూడా కోహ్లీ క్యాచును బంగ్లా ఫీల్డర్లు వదిలేశారు. అలాగే అంతకుముందు రెండు వన్డేల్లో గెలిచిన బంగ్లా అప్పటికే సీరీస్ తమ ఖాతాలో వేసుకుంది.
బంగ్లాపై ఈ రెండు టెస్టులు గెలవడం భారత జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచులు ఓడితే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో భారత్ చాలా వెనుకపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ చేరడం అసాధ్యంగా మారుతుంది. ఇలాంటి మ్యాచ్ లో కోహ్లీ విఫలం అవడంపై ఫ్యాన్స్ చాలా ఆగ్రహం చూపిస్తున్నారు. మరి రెండో ఇన్నింగ్సులో అయినా కోహ్లీ రాణిస్తాడేమో చూడాలి.