న్యూజిల్యాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరూ కనీసం జట్టును గెలిపించేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. ఆరంభంలోనే ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ, శుభ్మన్ గిల్ అవుటైపోయారు. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకోవాల్సిన బాధ్యతను సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తీసుకున్నారు. సూర్య కొంచెం క్రీజులో కుదురుకోగానే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ హార్దిక్ మాత్రం ఆ పని చేయలేదు. అతను ఎప్పుడు గేరు మార్చాలని అనుకున్నాడో తెలీదు. కానీ చాలా నెమ్మదిగా ఆడాడు. టీ20 క్రికెట్లో యాంకర్లు అక్కర్లేదని చాలా రోజుల నుంచి పలువురు నిపుణులు అంటున్న సంగతి తెలిసిందే. కానీ హార్దిక్ మాత్రం అచ్చం యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. అవతల వాషింగ్టన్ సుందర్ వచ్చి భారీ షాట్లు ఆడుతున్నా.. పాండ్యా మాత్రం గేరు మార్చలేదు. నిదానంగా డిఫెన్స్ ఆడుతూ ఉండిపోయాడు. తర్వాత స్పెషలిస్టు బ్యాటర్లు ఎక్కువ లేకపోయినా పాండ్యా మాత్రం భారీ షాట్లు ఆడలేదు.
ఈ మ్యాచ్లో పాండ్యా 20 బంతులు ఎదుర్కొని 21 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేసి అవుటైన తర్వాతి ఓవర్లోనే పాండ్యా కూడా పెవిలియన్ చేరాడు. అతని ఆటతీరు చూసిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 క్రికెట్లో ఇలాంటి ఇన్నింగ్స్ అవసరమా? అంటూ తిట్టిపోస్తున్నారు.
ఒకప్పుడు పాండ్యా అంటే సూపర్ ఫినిషర్ అనిపించేదని, కానీ ఇప్పుడు చూస్తుంటే 'టుక్ టుక్ అకాడమీ ప్రిన్సిపాల్'లా ఉన్నాడని ఎగతాళి చేస్తున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాండ్యా ఇచ్చే స్పీచ్.. అతను క్రీజులో ఉండే సమయమే తక్కువలా ఉందంటున్నారు. ఇటీవలి కాలంలో పాండ్యా తన ఇన్నింగ్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.