
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడింది. బ్యాటింగ్కు అనుకూలిస్తుందని అనుకున్న పిచ్పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆరంభంలో గిల్ (0) డకౌట్ అవడంతో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ ఒత్తిడి నుంచి బయటకు రావాలనే తపనతో అనవసర షాట్కు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (13) కూడా విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ (9), హార్దిక్ పాండ్యా (1) ఘోరంగా ఫెయిలయ్యారు.
ఇన్నింగ్స్ చక్కిదిద్దేందుకు ప్రయత్నించిన కోహ్లీ (31), జడేజా (16), అక్షర్ పటేల్ (29 నాటౌట్) కూడా పెద్దగా ఏం చెయ్యలేకపోయారు. మిచెల్ స్టార్క్ ఏకంగా ఐదు వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఇదంతా చూసిన అభిమానులు టీమిండియాను తెగ ట్రోల్ చేస్తున్నారు. వైజాగ్లోనే ఇలా ఆడితే ఇక సీమ్ పిచ్లు అయిన ఇంగ్లండ్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. స్టార్క్ ఒక్కడే టీమిండియా బ్యాటింగ్ లైనప్ను పూడ్చిపెట్టేశాడని, ఇదే ఆసీస్ను ఇంగ్లిష్ పిచ్లపై ఎలా ఎదుర్కొంటారని నిలదీస్తున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే భారత్ గెలిచిన రెండు మ్యాచుల్లో స్టార్క్, గ్రీన్ సహా కీలకమైన ఆటగాళ్లు ఆడలేదు. ఇక అతను స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ వహించిన చివరి రెండు టెస్టుల్లో భారత్ ఒక దానిలో ఓడగా.. చివరి మ్యాచ్ డ్రా అయిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా, భారత్ జట్లే తలపడతాయి. జూన్ 7న ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. పూర్తి ఫిట్నెస్ సాధించిన స్టార్క్ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే ఆందోళన ఫ్యాన్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. అసలే ఎడం చేతి వాటం స్వింగ్ బౌలింగ్ అంటే చాలు.. టీమిండియా వణికిపోతుందని ఇప్పటికే చెడ్డపేరుంది. ఈ మ్యాచ్తో ఈ పేరు మరింత బలపడిపోయిందని ఆందోళన చెందుతున్నారు.