వెస్టిండీస్తో టెస్టులకు భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్, మాజీలు అందరూ కలిసి బీసీసీఐపై మండిపడ్డారు. దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నిస్తే.. ఎవరూ అడిగే వారు లేరని పుజారాను పక్కన పెట్టేశారని మరికొందరు తిట్టిపోశారు. ఇంకొందరైతే సూర్యకు టెస్టుల్లో అవకాశం ఉందా? లేదా? అంటూ నిలదీశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్క ఛాన్స్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి మళ్లీ టెస్టులు ఆడే అవకాశం దక్కలేదు. దానికితోడు లాంగెస్ట్ ఫార్మాట్లో అతని రికార్డు కూడా అంత గొప్పగా లేదు. దీంతో అతన్ని విండీస్ టెస్టుల్లో పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. అంతకుముందు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్థానం రహానే దక్కింది.

ఇక ఇంగ్లండ్లోనే కౌంటీలు ఆడుతూ చాలా కాలం గడిపిన పుజారా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. దీంతో అతన్ని కూడా సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఇక సర్ఫరాజ్ ఫిట్నెస్, అతని యాటిడ్యూడ్ నచ్చలేదనే కారణంతో అతన్ని తీసుకోలేదు. ఇవేమీ కూడా కొందరికి నచ్చలేదు. బీసీసీఐని, సెలెక్టర్లను తెగ తిట్టిపోశారు. ఇలాంటి సమయంలో దులీప్ ట్రోఫీ వచ్చింది.
ఈ టోర్నీ సెమీఫైనల్స్లో సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ తలపడ్డాయి. పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా అందరూ వెస్ట్ జోన్లో ఉన్నారు. కానీ ఒక్కరు కూడా సరిగా ఆడలేదు. దీంతో సెమీస్లో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 216/8 స్కోరుతో నిలిచింది. పుజారా (28), పృథ్వీ షా (23) పరుగులు చేశారు. ఇక సూర్యకుమార్ కేవలం 7 పరుగులే చేయగా.. సర్ఫరాజ్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ నెట్టింట రెచ్చిపోతున్నారు. 'ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఇంపార్టెంట్ మ్యాచుల్లో పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఉండాలని చెప్పినోళ్లు ఇప్పుడేమంటారు?' అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరేమో ఈ మ్యాచ్ చూస్తే పుజారా పనైపోయిందని చాలా స్పష్టంగా తెలుస్తుందని అంటున్నారు. సూర్య కూడా టెస్టులు, వన్డేలకు పనికిరాడని తేల్చేస్తున్నారు.
'స్లోరాజా.. పనైపోయింది' అని పుజారాను టార్గెట్ చేస్తున్నారు. కనీసం ఖాతా తెరవలేకపోయిన సర్ఫరాజ్ను తీసుకోలేదని కొందరు ఏడ్చారంటూ ఎద్దేవా చేశారు. 'పృథ్వీ షా, పుజారా, సర్ఫరాజ్, సూర్య.. వీళ్లను సెలెక్ట్ చేయకపోవడంపై వచ్చిన ప్రశ్నలకు ఈ మ్యాచ్లో సమాధానాలు ఇచ్చేశారు' అంటూ జోకులు పేలుస్తున్నారు.