
దాయాది దేశం పాకిస్తాన్ తొలిసారిగా అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన ఏ మ్యాచ్లోనూ పాక్ ఓడలేదు. అది ఏ ఫార్మాట్ అయినా ఆధిపత్యం చెలాయిస్తూనే వచ్చింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ తదితరులు లేని పాక్ జట్టును పీసీబీ ఈ సిరీస్ కోసం ఎంపిక చేయడం గమనార్హం. ఈ టీంకు స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కెప్టెన్సీ చేశాడు.
షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్ఘాన్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ప్రతిఘటన చూపించలేకపోయారు. దీంతో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయినా కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్ఘాన్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూకీ, మహమ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లతో రాణించారు. దీంతో ఏ దశలోనూ పాకిస్తాన్ కోలుకునేలా కనిపించలేదు.
లక్ష్య ఛేదనలో అఫ్ఘానిస్తాన్ కూడా కొంత తడబడింది. పాక్ యువ బౌలర్ ఇన్షానుల్లా రెండు వికెట్లతో రాణించాడు. అయితే అఫ్ఘాన్ సీనియర్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ (38 నాటౌట్) పట్టుదలగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, అయితే తమ టాపార్డర్ ఇంకా బాగా ఆడాల్సిన అవసరం ఉందని అఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. పాకిస్తాన్పై తమకు తొలి విజయం కావడంతో ఇది తమకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు.
ఇలా పాక్ బ్యాటర్లు కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోవడంపై క్రికెట్ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. తమ పీఎస్ఎల్ ప్రపంచంలోనే అతి కష్టమైన లీగ్ అని, ఐపీఎల్ సహా మిగతా లీగులు ఏవీ పీఎస్ఎల్ ముందు పనికిరావని కామెంట్లు చేసే పాక్ అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. 'రోడ్ల వంటి పిచ్లపై పీఎస్ఎల్ ఆడటం అనుకున్నారా?' అంటూ అఫ్ఘాన్ ఫ్యాన్స్ కూడా జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదనేది మాత్రం నిజం.