
చట్టోగ్రాం వేదికగా భారత్, బంగ్లా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్పై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తం 13 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను మూడు కీలక వికెట్లు తీసుకొని మెప్పించాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో అతని బౌలింగ్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కానీ అతను మాత్రం తన ఎగ్రెసివ్ యాటిట్యూడ్ మార్చుకోలేదు. నాలుగో రోజు ఆటకు పిచ్ నుంచి బౌలర్లకు సహకారం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో సిరాజ్ ఎంత ప్రయత్నించినా వికెట్లు పడలేదు.
ఈ క్రమంలో బ్యాటర్లకు చిరాకు తెప్పించి వారితో తప్పటడుగు వేయించడానికి సిరాజ్ ప్రయత్నించాడు. బంగ్లా ఓపెనర్లు నజ్ముల్ షాంటో, అరంగేట్ర ఆటగాడు జాకిర్ హసన్ ఇద్దరినీ విపరీతంగా స్లెడ్జ్ చేశాడు. కానీ వాళ్లిద్దరూ దీన్ని చాలా లైట్గా తీసుకొని సిరాజ్తో వాగ్వాదానికి దిగలేదు. తమ ఆట కొనసాగించారు. ఎలాగైనా ఒక బ్రేక్ త్రూ కోసం ఎదురు చూసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం సిరాజ్కు మళ్లీ మళ్లీ బంతి అందిస్తూనే వచ్చాడు. కానీ అతను మాత్రం పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో తన ప్రభావం కోల్పోయాడు. ఇది చూసిన నెటిజన్లు సిరాజ్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. 'సిరాజ్ ఇప్పటికే తనను తాను జేమ్స్ ఆండర్సన్ అనుకుంటున్నాడు' అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అదే సమయంలో ఫ్లాట్ పిచ్లపై సిరాజ్ ఏమాత్రం ప్రభావం చూపించడంని, అతని కన్నా శార్దూల్ ఠాకూర్ బెటర్ అని మరికొందరు అంటున్నారు. సిరాజ్ను అనవసరంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారని అతనికి అంత సీన్ లేదని నెట్టింట కామెంట్లు పేలుతున్నాయి. అయితే ఈ ఇన్నింగ్స్లో ఉమేష్ యాదవ్ భారత్కు బ్రేక్ ఇచ్చాడు. అతను షాంటోను అవుట్ చేశాడు. ఆ తర్వాత రాణించిన స్పిన్నర్లు మరికొన్ని వికెట్లు తీసుకున్నారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా జట్టు 272/6 స్కోరుతో నిలిచింది.