
బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచులో టీమిండియా సారథి కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా రాణించలేదు. వ్యక్తిగత స్కోరు 23 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఫ్యాన్స్ అతనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
రెండు ఇన్నింగ్స్ లలో నెమ్మదిగా ఆడినందుకే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరీస్ ప్రారంభానికి ముందు దూకుడుగా ఆడతామని చెప్పి, ఈ జిడ్డు బ్యాటింగ్ ఏంటని తిట్టిపోశారు. చివరికి అలా నిదానంగా ఆడుతూ కూడా భారీ స్కోరు చెయ్యలేదని మరింత ట్రోల్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న రాహుల్.. తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
రెండో ఇన్నింగ్స్ లో అయినా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకుంటే కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో కూడా ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లోనే అవుటవడం కూడా ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది. ఖలీద్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన రాహుల్.. తైజుల్ ఇస్లాంకు సులభమైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో రెచ్చిపోతున్న నెటిజనులు.. 'అయ్యో రాహుల్.. జస్ట్ 77 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నావ్' అంటూ వెటకారం ఆడుతున్నారు.
అంతకుముందు వన్డే సిరీస్ లో కూడా రాహుల్ ఫెయిల్ అయ్యాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసినా కూడా.. ఆ తర్వాత రెండు వన్డేల్లో రాణించలేదు. ఇది కూడా గుర్తు చేస్తున్న ఫ్యాన్స్.. అంత దూకుడుగా ఆడితే ఎలా రాహుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రాహుల్ ఫెయిల్ అయిన దాని కన్నా టెస్ట్ సీరీస్ ప్రారంభానికి ముందు అతను చేసిన కామెంట్స్ వల్లనే ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది.