
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. తొలి బంతి నుంచే బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, పుజారా, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా అందరూ విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్లు ఈ పిచ్పై రాజ్యమేలుతున్నారు. అనూహ్యమైన బౌన్స్, స్పిన్ వస్తుండటంతో బ్యాటర్లు బంతిని సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట తెగ గోల చేస్తున్నారు. రాహుల్ ఈ మ్యాచ్లో ఆడకపోవడంపై జోకులు పేలుస్తున్నారు.
ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను పక్కన పెట్టారు. అతని స్థానంలో శుభ్మన్ గిల్ను ఆడించారు. పేసర్ల బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న గిల్.. స్పిన్నర్లు రాగానే తడబడ్డాడు. కునేమన్ బౌలింగ్లో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పుజారా కేవలం ఒక్క పరుగే చేయగా.. జడేజా నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ తను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మొదలైన గంట సేపట్లోనే కేవలం 45 పరుగులకే భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది.
ఈ పిచ్పై బంతి అనూహ్యంగా స్పిన్, బౌన్స్ అవడం చూసిన ఫ్యాన్స్ నెట్టింట తెగ జోకులు పేలుస్తున్నారు. రాహుల్ ఉండుంటే ఈ పిచ్పై '-1' పరుగులు చేసి ఉండేవాడని కొందరు జోకులు వేస్తుంటే.. తనను ఈ పిచ్పై ఆడించనందుకు రోహిత్, ద్రావిడ్కు రాహుల్ ధన్యవాదాలు చెప్తున్నాడు' అంటున్నారు. మరికొందరేమో కేఎల్ రాహుల్ను పక్కన పెట్టినందుకు వెంకటేశ్ ప్రసాద్ చాలా సంతోషిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ పిచ్పై బౌలింగ్ చూసి తను ఆడనందుకు రాహుల్ చాలా హ్యాపీ అని కొందరు అంటున్నారు.