
యువ ప్లేయర్ పృథ్వీ షా దేశవాళీల్లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తను ఎంత బాగా రాణించినా భారత జట్టుకు సెలెక్ట్ చేయని బీసీసీఐకి తన విలువ ఏంటో నిరూపిస్తూనే వస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో సిరీస్లో కనీసం టీ20లకైనా అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియా సిరీస్లో అతన్ని ఎంపిక చేస్తారా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఇలాంటి సమయంలో రంజీల్లో పృథ్వీ షా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అస్సాంతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 379 పరుగులు సాధించాడు. దేశవాళీల్లో ఒక ఓపెనర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 49 ఫోర్లు బాదేశాడు. ఇది చూసిన అభిమానులు బీసీసీఐని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా పృథ్వీ షా ఇన్నింగ్స్పై స్పందించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ ట్రోలింగ్ను మరో రేంజ్కు తీసుకెళ్లారు.
'రికార్డు పుస్తకాల్లో మరో ఎంట్రీ. ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు పృథ్వీ షా. రంజీ ట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు సాధించిన సందర్భంగా కృతజ్ఞతలు. నువ్వు ఎంతో పొటెన్షియల్ ఉన్న అద్భుతమైన ట్యాలెంట్వు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నాం' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా పృథ్వీ షా ట్రిపుల్ సెంచరీ చేశాడనే విషయాన్ని సెలెక్టర్లకు చెప్పారా? అంటూ జై షాను ప్రశ్నిస్తున్నారు. అతన్ని ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకైనా సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇన్నింగ్స్తో అయినా అతన్ని మళ్లీ టీమిండియాకు సెలెక్ట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.