
భారత్లో క్రికెట్ అంటే ఎంత పిచ్చి ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియాలు ఫుల్లుగా నిండిపోవాల్సిందే. టెస్టు క్రికెట్కు కూడా ప్రేక్షకులు క్యూ కడుతుంటారు. అలాంటిది బలమైన ఆస్ట్రేలియాతో సిరీస్ జరుగుతుంటే చూడకుండా ఉండగలరా? అందుకే ఆసీస్తో జరిగే మ్యాచ్ టికెట్ల కోసం క్యూలు కడుతున్నారు. అది కూడా ఆలస్యం అవడంతో ఆ క్యూ లైన్లోనే కునుకు తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియాతో ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అతి కష్టం మీద గెలిచింది. కేఎల్ రాహుల్ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. దీంతో సిరీస్లో పైచేయి సాధించిన భారత్కు రెండో వన్డేలో చేదు అనుభవం ఎదురైంది. మిచెల్ స్టార్క్, షాన్ ఆబాట్, నాథన్ ఎల్లీస్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో స్వదేశంలో ఆసీస్పై అత్యల్ప స్కోరు నమోదు చేశారు. భారత్ నిర్దేశించిన 118 పరుగుల టార్గెట్ను ఆసీస్ ఓపెనర్లు కేవలం 11 ఓవర్లలోనే బాదేశారు.
దీంతో చెన్నైలోని ఎం. చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్ టికెట్ల కోసం రెండో వన్డే జరగడానికి ముందే ప్రేక్షకులు క్యూ కట్టారు. ఉదయం 2 గంటల నుంచే స్టేడియం వద్ద క్యూలు కట్టారు. కొందరైతే దుప్పట్లు తెచ్చుకొని అవి కప్పుకొని పడుకున్నారు కూడా. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలు పూర్తి 50 ఓవర్లు జరగలేదు. చెన్నైలో అయినా హై స్కోరింగ్ మ్యాచ్ జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి.