ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పలు మార్పులతో తాజాగా జట్టును ప్రకటించింది టీమిండియా. అయితే ఇందులో హైదరాబాదీ సిరాజ్ ను మెయిన్ స్క్వాడ్ లోకి కాకుండా నాన్ ట్రావెల్ రిజర్వ్గా ఎంపిక చేయడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. బుమ్రా స్థానంలో సీనియర్ పేసర్ సిరాజ్ ను తీసుకోవాల్సింది పోయి.. కుర్రాడిగా ఉన్న హర్షిత్ రాణాను తీసుకోవడం అవసరమా అంటూ తిడుతున్నారు. ముఖ్యంగా గంభీర్ పై విమర్శలను ఎక్కుపెట్టారు. గంభీర్ ఏకపక్షంగా, స్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడని, అతడు ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహించిన కేవలం కేకేఆర్ ప్లేయర్స్ ను మాత్రమే సెలెక్ట్ చేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు.
టీమిండియా-ఇంగ్లాండ్ వన్డే సిరీస్తో హర్షిత్ రాణా వన్డే అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టిన రాణా.. రెండో వన్డేలో ఓ వికెట్ దక్కించుకున్నాడు. అయితే అతడికి దుబాయ్ పిచ్లపై ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో దుబాయ్ పిచ్లపై సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తాడని, అతడినే బుమ్రా స్థానంలో తీసుకోవాలని పలువురు సూచనలు చేస్తున్నారు.

'భారత క్రికెట్లో ఏకపక్షంగా, స్వార్థంతో నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం', 'సిరాజ్ కు జట్టులో స్థానం ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయం', 'జట్టులో ఐదుగురు స్పిన్నర్లు అవసరమా? ఒక స్పిన్నర్కు బదులు సిరాజ్ను తీసుకుంటే సరిపోయేది కదా', 'అసలు యశస్వి జైస్వాల్ను ఎందుకు పక్కనపెట్టారు, సుందర్ స్థానంలో యశస్విని తీసుకుంటే బాగుండేది'... అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా.