
టీమిండియా సూపర్ స్టార్పై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అతన్ని అసలు టెస్టు క్రికెట్లోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ బ్యాటర్ మరెవరో కాదు.. సూర్యకుమార్ యాదవ్. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సూర్య.. భారత బ్యాటింగ్లో ఆకట్టుకోలేదు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి, స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్.. అదే ఫామ్ను మిగతా ఫార్మాట్లలో కంటిన్యూ చెయ్యలేకపోయాడు. వన్డేల్లోనే అతను రాణించలేదు. దీంతో అతనిపై తెగ విమర్శలు వచ్చాయి. కేవలం టీ20ల్లో మాత్రమే సూర్య రాణిస్తాడని, మిగతా ఫార్మాట్లలో ఇన్నింగ్స్ నిర్మించడం కూడా అతనికి చేతకాదని ఫ్యాన్స్ మండిపడ్డారు. అలాంటి ఆటగాడిని ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ఎంపిక చేయడంపై చాలా విమర్శలు వచ్చాయి.
ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను కాదని సూర్యకు తొలి టెస్టులో అవకాశం ఇచ్చింది టీం మేనేజ్మెంట్. అయితే అతను మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తను ఆడిన మొదటి టెస్టులో కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. ఏమాత్రం రాణించలేదు. పంత్ లేని లోటును పూడ్చేందుకు సూర్యను తీసుకున్న టీమిండియాకు ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
మొత్తం 20 బంతులు ఎదుర్కొన్న సూర్య ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేశాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ వేసిన బంతిని ఏమాత్రం అంచనా వేయలేకపోయాడు. బంతిని స్వీప్ చేయబోయి విఫలమయ్యాడు. దీంతో ఆ బంతి ఆఫ్స్టంప్ను కూల్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'టీ20 ప్లేయర్ను టెస్టుల్లో ఆడిస్తే ఇలాగే ఉంటుంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సూర్యకు మద్దతు ఇస్తున్నారు. తన నేచురల్ ఆట ఆడనిస్తే సూర్య రాణిస్తాడని అంటున్నారు. మరి రెండో ఇన్నింగ్స్లో అతనికి ఆ అవకాశం దక్కుతుందేమో చూడాలి.