
భారత్ కంచు కోట. ఇక్కడ టీమిండియా ఓడటం అసంభవం. చివరిసారి ఇక్కడ భారత్ ఆడిన టెస్టులో ఏమైందో తెలుసా? అంటూ ఇండోర్ టెస్టుకు ముందు చాలా మంది బడబడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అది కూడా నిజమే.. హోల్కర్ స్టేడియంలో ఆడిన టెస్టుల్లో ఇప్పటి వరకు భారత్ ఓడింది లేదు. కానీ ప్రతి దానికీ ఒక ఆరంభం ఉంటుంది కదా. అంతకుముందు వైట్ బాల్ ఫార్మాట్లలో కూడా భారత్ ఇక్కడ ఓడిపోలేదు. కానీ సౌతాఫ్రికా దానికి నాంది పలికింది. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా భారత్కు ఇక్కడ ఓటమి రుచి చూపించింది.
టీమిండియా ఫుల్టైం కెప్టెన్గా పగ్గాలు అందుకున్న తర్వాత టెస్టుల్లో రోహిత్ ఓటమెరుగడు. అంతేకాదు, హోల్కర్ స్టేడియంలో భారత్కు ఓటమి లేదు. దానికితోడు ఈ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు ఖరారు అవుతుంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టొచ్చు. ఇన్ని ఆలోచనలతో ఇండోర్లో అడుగు పెట్టిన భారత జట్టుకు షాకింగ్ ఫలితం దక్కింది. స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు.
అదే సమయంలో ఆసీస్ బ్యాటర్లు మాత్రం ఎటాకింగ్ గేమ్ ఆడుతూ తమ బేసిక్స్కు కట్టుబడి రాణించారు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి విజయాన్ని నమోదు చేశారు. భారత్ కంచుకోట అనుకున్న ఇండోర్ స్టేడియంలో టీమిండియాను తొమ్మిది వికెట్ల ఓడించారు. ఈ ఓటమిని చూసిన టీమిండియా అభిమానులు భారత జట్టుపై మండిపడుతున్నారు. గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం వల్లనే టీమిండియా ఇంత ఘోరంగా ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో కేఎల్ రాహుల్ ఈ జట్టుకు లక్కీ చార్మ్ అంటూ జోకులు పేలుస్తున్నారు.