ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి విజయవంతమైన జట్టే. కానీ ఆ టీం కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తుంది. ఇదే విషయాన్ని ఆ టీం హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా కొంతకాలం క్రితం ఒప్పుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. గతంలో చెన్నై టీం నెట్ బౌలర్గా ఉండేవాడు. అతన్ని జట్టులోకి తీసుకోవడంలో చెన్నై ఫెయిలైంది.
ఇదే విషయాన్ని ఫ్లెమింగ్ చెప్పాడు. తాము చాలా కష్టపడినా వరుణ్ను తమ జట్టులో ఉంచుకోలేకపోయామని అన్నాడు. ఇప్పుడు మరో ప్లేయర్ విషయంలో ఫ్యాన్స్ ఇదే మాట అంటున్నారు. ఆ ప్లేయరే బాబా అపరాజిత్. అండర్-19 టీంలో ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన అతన్ని చెన్నై జట్టులోకి తీసుకుంది. కానీ అక్కడ సత్తా నిరూపించుకునే అవకాశం అపరాజిత్కు పెద్దగా రాలేదు.

ఈ క్రమంలోనే అతన్ని తర్వాతి ఎడిషన్లలో చెన్నై రిలీజ్ చేసేసింది. ఇప్పుడు అతను తమిళనాడు ప్రీమియర్ లీగ్లో చెలరేగుతున్నాడు. చెపాక్ సుపర్ గిల్లీస్ తరఫున ఆడుతున్న అతను.. దిండిగుల్ డ్రాగన్స్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో చెపాక్ టీం ఓడిపోయినా కూడా.. అపరాజిత్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఫ్యాన్స్ అందరూ అతన్ని వదిలేసి చెన్నై సూపర్ కింగ్స్ తప్పు చేసిందని అంటున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగుల్ డ్రాగన్స్ 170 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెపాక్ టీంకు సరైన ఆరంభం దక్కలేదు. అయితే చివర్లో బాబా అపరాజిత్ కేవలం 40 బంతుల్లోనే 74 పరుగులతో చెలరేగాడు. దీంతో చెపాక్ ఈ మ్యాచ్లో గెలిచేలా కనిపించింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అతను బాదిన రెండు భారీ సిక్సులు మ్యాచ్కే హైలైట్.
అయితే ఆ తర్వాత చక్రవర్తి బౌలింగ్లోనే అపరాజిత్ అవుటయ్యాడు. దీంతో చెపాక్ జట్టు తడబడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ కనీసం పోరాడలేదు. ఈ క్రమంలో చెపాక్ నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. అపరాజిత్ మరొక్క బంతి ఎదుర్కొని ఉన్నా చెపాక్ గెలిచేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా చెన్నై అతని విషయంలో కూడా ఫెయిలైందని చెప్తున్నారు.