
మూడో రోజు కుల్దీప్ కంటిన్యూస్..
ఈ టెస్టు రెండో రోజు బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. మూడో రోజు కూడా రాణించాడు. మూడో రోజు తొలి సెషన్లోనే మరో వికెట్ తీసుకొని తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా మరో వికెట్ తీసుకోవడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లకు ఎదురొడ్డే ప్రయత్నం చేసిన బంగ్లా బ్యాటర్లు 150 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అంతకుముందు ఊహించినట్లే బంగ్లాను ఫాలో ఆన్ ఆడనివ్వని భారత జట్టు బ్యాటింగ్కు దిగింది.

రాహుల్, గిల్ జిడ్డు బ్యాటింగ్..
రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఇద్దరూ అచ్చమైన టెస్టు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 20 ఓవర్లకు కేవలం 63 పరుగులు చేసింది టీమిండియా. ఇది చూసిన భారత అభిమానులు మరోసారి రాహుల్ను ఎద్దేవా చేస్తున్నారు. 'ఇదేనా నువ్వు చెప్పిన దూకుడైన ఆట?' అంటూ ప్రశ్నిస్తున్నారు. 'మీ దూకుడు చూస్తుంటే నాకు నిద్రొచ్చేస్తోంది' అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మ్యాచ్కు ముందు రాహుల్ అలాంటి కామెంట్స్ చేసి ఉండాల్సింది కాదని చాలా మంది అంటున్నారు. టీమిండియా వెటరన్ స్టార్ దినేష్ కార్తీక్ కూడా రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. భారత డీఎన్ఏలో 'బాజ్ బాల్' లేదని తేల్చిచెప్పాడు.

తొలి ఇన్నింగ్స్లోనూ అంతే..
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో కూడా రాహుల్, గిల్ జోడీ నిదానంగానే ఆడింది. దానికితోడు వాళ్లిద్దరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు కూడా. కోహ్లీ కూడా ఫెయిలవడంతో ఛటేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్ అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్లతో జట్టును ఆదుకున్నారు. వాళ్లను అభిమానులు కూడా మెచ్చుకున్నారు. చివర్లో అశ్విన్, కుల్దీప్ యాదవ్ కూడా బ్యాటుతో సహకారం అందించడంలో భారత జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు చెలరేగడంతో బంగ్లా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిపోయింది.


Click it and Unblock the Notifications












