కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఎంత మంచివాడో చాలా మంది చెప్తూనే ఉంటారు. ఏమాత్రం గర్వం లేని మనిషని, అందరితో సరదాగా గడుపుతాడని ధోనీకి పేరు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు టైటిల్ అందించిన ధోనీ.. ప్రస్తుతం తన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మోకాలి గాయంతోనే సీజన్ అంతా ఆడిన అతను.. లీగ్ ముగియగానే సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.
సర్జరీ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన ధోనీ తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ధోనీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన విల్లాలో పని చేసే సెక్యూరిటీ గార్డుకు ధోనీ సాయం చేశాడు. విల్లా గేటు వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డు తన డ్యూటీ కోసం వస్తుండగా ధోనీ చూశాడు. విల్లా నుంచి గేటు చాలా దూరం ఉండటంతో సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు.
స్వయంగా తనే అతన్ని బైకుపై కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి గేటు వద్ద వదిలిపెట్టాడు. ఆ సమయంలో విల్లా గేటు వద్ద ధోనీని చూసేందుకు ఎదురు చూస్తున్న కొందరు అభిమానులు దీన్ని తన మొబైల్ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ధోనీ ఫ్యాన్స్ మరోసారి ధోనీ మనసు ఎంత మంచిదో రుజువైందని అంటున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్.. ధోనీకి చివరిదని చాలా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ట్రోఫీ నెగ్గిన తర్వాత అభిమానుల కోసం మరొక్క సీజన్ ఆడాలని అనుకుంటున్నానని ధోనీ చెప్పాడు. ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకుంటున్న అతను.. వచ్చే ఐపీఎల్ సీజన్ సమయానికి ధోనీ ఒకవేళ మనసు మార్చుకున్నా కూడా.. ముందుగా ఈ నిర్ణయాన్ని నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్కే తెలియజేస్తాడని సమాచారం.