ప్రపంచకప్ వేదికగా పాకిస్తాన్ టీమ్పై కోహ్లీ సేన కుట్ర పన్నుతోందా? అవుననే అంటోన్న..!

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ టోర్నమెంట్లో ఒక్కో మ్యాచ్ గెలుస్తున్న కొద్దీ.. ఆ దేశ మాజీ క్రికెటర్లు అత్యుత్సాహాన్ని చూపుతున్నారు. 1992 నాటి ప్రపంచకప్ టోర్నమెంట్ తరహాలోనే, ఇప్పుడు కూడా అచ్చు గుద్దినట్టు పాకిస్తాన్ ప్రస్థానం కొనసాగుతుండటం పట్ల గాల్లో తేలుతున్నారు. ప్రపంచకప్ అందేసినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మాజీ క్రికెటర్లు నోరు జారుతున్నారు. పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. చులకన అవుతున్నారు. తాజాగా- పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ చేసిన ఓ ఆరోపణ భారత క్రికెట్ జట్టు అభిమానులకు ఆగ్రహానికి చేసింది. తమ ఆగ్రహాన్ని, అసహనాన్ని వెరైటీగా ప్రదర్శిస్తున్నారు.

ఇంతకీ.. బాసిత్ అలీ ఏం చెప్పారు?
కరాచీలో ఓ స్థాని న్యూస్ ఛానల్ నిర్వహించిన టాక్ షో కార్యక్రమానికి హాజరయ్యారు బాసిత్ అలీ. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు చిత్ర, విచిత్రమైన సమాధానాలను ఇచ్చారు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టుపై టీమిండియా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సర్ఫరాజ్ అహ్మద్ జట్టును సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకోవడానికి కోహ్లీసేన శాయశక్తులా ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీనికోసం- భారత క్రికెట్ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచులను ఓడిపోతుందని కూడా జోస్యం చెప్పేశారాయన. దీనికి ప్రధాన కారణం.. పాకిస్తాన్ జట్టును చూసి టీమిండియా భయపడిపోతోందని అన్నారు.

రన్ రేట్ భారత్ వైపే..
నిజానికి- ప్రస్తుత ప్రపంచకప్లో అటు టీమిండియాకు గానీ, ఇటు పాకిస్తాన్కు గానీ సెమీ ఫైనల్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం సెమీ ఫైనల్లో తన బెర్త్ను ఖాయం చేసుకున్న జట్టు ఆస్ట్రేలియా ఒక్కటే. భారత్ ఇంకా మూడు మ్యాచ్లను ఆడాల్సి ఉన్నందున ఢోకా లేదు. భారత జట్టు తన తదుపరి మ్యాచుల్లో ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ మూడింట్లో ఇంగ్లండ్ ఒక్కటే టీమిండియాకు కాస్త కఠినంగా కనిపించే జట్టు. మిగిలిన రెండింటిని కూడా భారత జట్టుకు సమవుజ్జీలుగా భావించలేం. ఈ క్రమంలో- కోహ్లీసేన సెమీ ఫైనల్కు చేరడం నల్లేరు మీద నడకే అవుతుంది.

పాక్ పరిస్థితేంటీ?
పాకిస్తాన్ పరిస్థితి టీమిండియాకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ జట్టు ముందుకు వెళ్లాలీ అంటే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి గెలవడం, రెండు రన్రేట్ మీద ఆధారపడటం. భారత్ జట్టు ఒకటి లేదా రెండు మ్యాచుల్లో ఓడిందంటే.. పాకిస్తాన్ పని ఖల్లాస్ అవుతుంది. ఎందుకంటే- భారత జట్టు రెండు మ్యాచుల్లో ఓడినప్పటికీ.. మెరుగైన రన్రేట్ ఆధారంగా సెమీస్కు వెళ్లగలదు. పాకిస్తాన్ పరిస్థితి అలా లేదు. రన్రేట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితే గనక పాకిస్తాన్కు ఎదురైతే.. ఆ జట్టు సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమే అవుతుంది. ఇదే విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో విశ్లేషించారు బాసిత్ అలీ.

పాక్ సెమీ ఫైనల్ చేరకుండా ఉండటానికి..
పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్కు చేరకుండా ఉండటానికి టీమిండియా ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతుందని బాసిత్ అలీ ఆరోపించారు. టీమిండియా అడ్డును తొలగించుకుంటే పాకిస్తాన్ ప్రపంచకప్ను గెలుచుకుంటుందని చెప్పేశారు. పాకిస్తాన్ను సెమీస్ రాకుండా చేయడానికి టీమిండియా.. తన రెండు మ్యాచులను ఓడిపోతుందని అన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్లపై ఓడిపోయి, తన నెట్ రన్రేట్ను కొద్దిగా తగ్గించుకుంటుందని, ఫలితంగా- పాకిస్తాన్ కంటే మెరుగైన రన్రేట్ ఆధారంగా టీమిండియా సెమీస్కు వెళ్తుందని అన్నారు. భారత జట్టు కావాలనే మిగితా మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శన చేయడంతో పాక్ సెమీస్ అవకాశాలను దెబ్బతిస్తుందని వ్యాఖ్యానించాడు. కావాలనే మిగిలిన మ్యాచ్ ల్లో టీమిండియా ఓడిపోవడంతో పాక్ ఇంటి దారి పడుతుందని జోస్యం చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications