IPL 2025: పంజాబ్ కింగ్స్కు చేదువార్త. కానీ పంజాబ్ కింగ్స్ అభిమానులకు శుభవార్త. అదేంటి ఇలా అంటున్నారు ఏంటని అనుకుంటున్నారు. ఆ ఫ్రాంఛైజీ.. ఓ ఆటగాడిని ఎంతో అంచనాలు పెట్టుకుని రూ.4.2 కోట్లకు కొనగోలు చేస్తే హాఫ్ సెంచరీ బాదడం కాదు కదా.. కనీసం సింగిల్ డిజిట్ స్కోరు కూడా చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అంచనాలు తారుమారు చేస్తూ పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.
ఇంతకీ అతడెవరంటే
పంజాబ్ జట్టు ఆస్ట్రేలియన్ ఆల్రౌండరైన గ్లెన్ మ్యాక్స్వెల్ గురించే ఇదంతా. పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తుంటే.. జట్టులోని ఈ ఒక్కడు మాత్రం పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచుకు ముందు అతడి చేతి వేలుకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఆ మ్యాచులోనూ బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్ వచ్చాడు. ఇప్పుడు తాజాగా మ్యాక్సీ గాయంపై పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తో పాటు మార్కస్ స్టాయినిస్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అతడు ఐపీఎల్ లోని మిగితా మ్యాచులకు దూరం కానున్నట్లు అర్థమైంది.

"దురదృష్టవశాత్తు, మాక్స్వెల్ వేలు విరిగింది. ప్రాక్టీస్ లాస్ట్ మ్యాచుకు ముందు అతడు గాయపడ్డాడు. అయితే మేం అది చిన్న గాయమే అనుకున్నాం. కానీ ఆ తర్వాత అది పెద్ద గాయమని తెలిసింది. స్కానింగ్లో వేలు విరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అందుకే ఇక అతడు టోర్నమెంట్కు దూరమయ్యే అవకాశముంది. " అని మార్కస్ స్టాయినిస్ పేర్కొన్నాడు. ఆ వెంటనే మ్యాక్స్వెల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సరైన ఆటగాడి కోసం చూస్తున్నామని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఎలాగో ఈ సీజన్లో మ్యాక్స్వెల్ పెద్దగా ఫామ్లో లేడు. ఏడు మ్యాచులాడి 97.95 స్ట్రైక్ రేటుతో 0, 30, 1, 3, 7, 7 కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. 4 వికెట్లు పడగొట్టాడు. అందుకే పలువురు క్రికెట్ అభిమానులు ఇప్పుడు పంజాబ్ జట్టుకు అతడు దూరమైనంత మాత్రానా పెద్ద నష్టమేమి లేదు. అతడి స్థానంలో మరో మంచి ఆటగాడిని తీసుకొచ్చి ఆడిస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే పంజాబ్ కింగ్స్ జట్టు ఆడిన 10 మ్యాచుల్లో ఆరింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.