
కొన్ని రోజుల క్రితం న్యూజిల్యాండ్తో మ్యాచ్లో విఫలమైన రిషభ్ పంత్.. డ్రెస్సింగ్ రూంలో మసాజ్ తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. అతనికి ఏమైనా గాయమైందా? అని పంత్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ అలాంటిదేమీ లేదని చెప్పిన టీం మేనేజ్మెంట్ బంగ్లా పర్యటనకు పంత్ను పంపించింది. ఈ సిరీస్లో అయినా రాణించి తనపై పడిన చెడు ముద్రను పంత్ తొలగించుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు.
కానీ అనూహ్యంగా తొలి వన్డే ప్రారంభానికి నిమిషాల ముందే పంత్కు గాయమైందని, అతను ఈ సిరీస్లో ఆడటం లేదని రోహిత్ శర్మ వెల్లడించాడు. మళ్లీ టెస్టు సిరీస్ నాటికి జట్టుతో కలుస్తాడని వెల్లడించాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్న పంత్.. అప్పటి కప్పుడు గాయం బారిన పడటం ఏంటని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ట్విట్టర్లో అభిమానులు తెగ మీమ్స్ చేశారు. అసలు పంత్కు నిజంగానే గాయమైందా? లేదంటే ఎటూ పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించడం లేదు కదా అని పక్కన పెట్టేశారా? అని అభిమానుల అనుమానం.
ఈ విషయాన్ని బయటకు చెప్తే పంత్ కెరీర్పై మచ్చ పడుతుందని, కావాలనే ఇలా కుంటి సాకులు చెప్పి అతన్ని తప్పించారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో పంత్ ఫామ్ చూస్తే ఈ అనుమానాల్లో తప్పేమీ లేదని అనిపిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో పంత్ అద్భుతంగా రాణించాడు. తనదైన స్టైల్లో ఆడి పరిమిత ఓవర్ల క్రికెట్లో తొలి సెంచరీ సాధించాడు. దీంతో అతను కనీసం వన్డే ఫార్మాట్లో అయినా సెట్ అయినట్లే అని అభిమానులు అనుకున్నారు.
కానీ అతను మాత్రం మరే మ్యాచ్లోనూ రాణించలేదు. ఆ ఇన్నింగ్స్ తర్వాత ఒక్కసారి కూడా కనీసం హాఫ్ సెంచరీ మార్కు దాటలేదు. అదే సమయంలో తనకు వచ్చిన కొద్ది అవకాశాలను సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఉపయోగించుకుని రాణించారు. వీళ్లకు ఈ ఫార్మాట్లో చోటు దక్కాలంటే పంత్ను తప్పించక తప్పదు. అందుకే టీమిండియా ఇలా కుంటి సాకులతో పంత్ను పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరం చేస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.