
భారత దేశంలోనే కాదు ప్రపంచ క్రికెట్లోనే తొలిసారిగా మహిళల ప్రీమియర్ లీగ్కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ డబ్ల్యూపీఎల్లో మొత్తం ఐదు జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. వీటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ ఫ్రాంచైజీ వేలంలో అద్భుతమైన స్ట్రాటజీతో బరిలో దిగింది. చాలా బలమైన జట్టును ఎంపిక చేసుకుంది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన స్మృతి మంధానను ఆర్సీబీనే కొనుగోలు చేసింది. ఆమెనే తమ జట్టు కెప్టెన్గా కూడా ప్రకటించింది.
ఇక్కడి వరకు అంతా సంతోషించారు. అయితే సడెన్గా ఆర్సీబీ తలాతోక లేని ఒక నిర్ణయం తీసుకుంది. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తమ జట్టు మెంటార్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వార్త విన్న అభిమానులకు షాక్ తగిలినట్లు అయింది. దీన్ని ఎలా జీర్ణం చేసుకోవాలో కూడా ఎవరికీ అర్థం కాలేదు. అయితే కొందరు మాత్రం ఆర్సీబీ చాలా మంచి నిర్ణయం తీసుకుందని మెచ్చుకుంటున్నారు. తమ జట్టులో గ్లామర్ డోస్ తగ్గకుండా ఆర్సీబీ జాగ్రత్తలు తీసుకుందంటూ ఛలోక్తులు విసురుతున్నారు.
కానీ చాలా మంది అభిమానులు మాత్రం క్రికెట్తో ఏమాత్రం సంబంధం లేని సానియాను జట్టు మెంటార్గా నియమించడం ఏంటని నోరెళ్లబెడుతున్నారు. ఇలాగైతే 'చక్దా ఎక్స్ప్రెస్' చిత్రంలో టీమిండియా మాజీ పేసర్ ఝులన్ గోస్వామి పాత్ర పోషించిన బాలీవుడ్ భామ అనుష్క శర్మకు కూడా జట్టులో చోటివ్వాలని, ఆమెను బౌలింగ్ కోచ్గా నియమిస్తే బాగుంటుందని జోకులు పేలుస్తున్నారు. అక్కడితో ఆగకుండా నెట్స్లో మంధాన, ఎలీస్ పెర్రీ తదితర ప్లేయర్లంతా టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తారా? అని అడుగుతున్నారు. ఈ మీమ్స్ చూసిన నెటిజన్లు నవ్వలేక ఛస్తున్నారు. మరి ఈ జట్టు మెంటార్గా సానియా ఏం మాయ చేస్తుందో చూడాలి.