
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టును తన అద్భుతమైన ప్రతిభతో రవిచంద్రన్ అశ్విన్ మలుపు తిప్పాడు. అప్పటి వరకు ఆస్ట్రేలియా వైపు మొగ్గుతున్న మ్యాచ్ను ఒక్కసారిగా భారత్ వైపు తిప్పేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెస్టు సిరీసులో అద్భుతంగా రాణించి టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ ర్యాంకింగ్ సాధించిన అశ్విన్కు బౌలింగ్ ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు.
తొలిరోజు ఆటలో బెంబేలెత్తిన భారత బ్యాటింగ్.. ఆస్ట్రేలియా ముందు భారీ స్కోరు ఉంచలేకపోయింది. బ్యాటర్లు అందరూ తడబడటంతో 109 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. దీనికి బదులుగా ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతమైన పోరాటం కనబరిచారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీతో రాణించాడు. లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, పీటర్స్ హాండ్స్కోంబ్ కూడా ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా గ్రీన్, హాండ్స్కోంబ్ జోడీ.. రెండో రోజు ఆట మొదలైన తర్వాత మంచి పట్టుదల కనబరిచింది.
అయితే రెండో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్ల పట్టుదల కన్నా భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలే అభిమానులకు చికాకు తెప్పించాయి. తొలి రోజు రాణించిన జడేజాతో ఎక్కువగా బౌలింగ్ చేయించిన రోహిత్.. మరో ఎండ్ నుంచి అక్షర్తో బౌలింగ్ చేయించాడు. ఉదయం నుంచి బౌలింగ్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న అశ్విన్కు మాత్రం బంతి అందించలేదు. డ్రింక్స్ బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అశ్విన్ బౌలింగ్కు రాకపోవడం చూసిన అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.
అయితే ఆ తర్వాత బంతి అందుకున్న కాసేపటికే అశ్విన్ సత్తా చాటాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన హాండ్స్కోంబ్ను అవుట్ చేశాడు. అక్కడితో ఆగకుండా మళ్లీ అవకాశం రాగానే అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చాడు. చివరకు ఆసీస్ చివరి వికెట్ కూడా తీసి వాళ్లను ఆలౌట్ చేశాడు. ఇదంతా చూసిన అభిమానులు.. ఇంత సూపర్ బౌలర్కు బంతి ఇవ్వడానికి ఇంత సేపు ఆలోచించావా? అని రోహిత్ను నిలదీస్తున్నారు.