భారత జట్టు గత ఐదేళ్లలో చూసినన్ని మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. ఎందుకంటే.. విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత భారత జట్టు చాలా తడబడింది. ప్రదర్శన పరంగా పెద్దగా మార్పులు కనిపించకపోయినా.. జట్టు కూర్పులో రకరకాల మార్పులు వచ్చాయి. దీంతో జట్టులో బాండింగ్ మిస్ అవుతుందని చాలా మంది ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
భారత జట్టు గతంలో వన్డే వరల్డ్ కప్ గెలిచింది 2011లో అని అందరికీ తెలిసిందే. అంతకుముందు వైస్ కెప్టెన్గా ఉన్న గంభీర్, సెహ్వాగ్ వంటి వారు ధోనీ లేని సమయంలో జట్టు పగ్గాలు అందుకోవడం మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత ఏదో అడపా దడపా మాత్రమే ధోనీ లేకపోతే కెప్టెన్సీ మరొకరు చేసేవారు. ఈ లెక్కన పూర్తిగా కనీసం ఒక సిరీస్లో జట్టుకు కెప్టెన్సీ వహించిన వాళ్లు చాలా తక్కువనే చెప్పాలి.

సెహ్వాగ్, ధోనీ, రైనా, రహానే, గంభీర్.. ఇలా ఎంత మంది ఉన్నా కూడా 2006 నుంచి 2016 వరకు కెప్టెన్సీలో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. ముఖ్యంగా ధోనీకి జట్టు పగ్గాలు అందించిన తర్వాత అతనే మెయిక్ కెప్టెన్గా ఉన్నాడు. మిగతా వాళ్లు ఎవరైనా సరే తాత్కాలిక కెప్టెన్లే. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది.
2017 తర్వాత భారత క్రికెట్లో చాలా తడబాటు కనిపించిందనే చెప్పాలి. ఎందుకంటే 2016లో ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న కోహ్లీ.. 2018లో జరిగిన ఆసియా కప్లో ఆడలేదు. ఆ టోర్నీలో రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఆడింది. ఇక కోహ్లీ తిరిగొచ్చిన తర్వాత మళ్లీ అతనే కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక 20221లో టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు.
దీంతో అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తొలగించింది. ఈ క్రమంలో కోహ్లీ కెప్టెన్సీ విషయంలో పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలోనే ఆ మరుసటి ఏడాది అంటే 2022 ఆరంభంలోనే టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఇక అప్పటి నుంచి రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధవన్ ఇలా ఒకరి తర్వాత ఒకరు భారత జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తించారు.
దానికితోడు పొట్టి ఫార్మాట్లో రోహిత్ అసలు ఆడటం లేదు. దీంతో ఈ ఫార్మాట్లో చాలా మంది కెప్టెన్లు మారారు. ఇకపై కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్గా రోహిత్ కొనసాగుతాడు. కానీ పొట్టి ఫార్మాట్లో మాత్రం మార్పులపై మార్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్, ఇక వచ్చే ఆస్ట్రేలియా సిరీసులో సూర్యకుమార్తో కలుపుకొంటే.. ఈ ఐదేళ్లలో మొత్తం 9 మంది కెప్టెన్లను టీమిండియా మార్చింది. వీరిలో బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. ఇలాంటి మార్పుల వల్ల జట్టుకు నష్టమేతప్ప ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు.