
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్లో భరత్ విఫలమయ్యాడు. అయితే తొలి ఇన్నింగ్స్ కదా టెన్షన్ పడి ఉంటాడని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతను రాణిస్తాడని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అవుటైన తర్వాత భరత్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీతో కలిసి అతను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడతాడని అంతా అనుకున్నారు.
కానీ కాసేపటికే అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. అప్పటికి అతని స్కోరు కేవలం 44 పరుగులు మాత్రమే. దీంతో భరత్ తప్పనిసరిగా భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ భరత్ మాత్రం తన వైఫల్యానని కొనసాగించాడు. వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద లియాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. స్వీప్ షాట్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. అతని షాట్ మిస్ అవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని స్టీవ్ స్మిత్ అద్భుతంగా పట్టేశాడు. దీంతో భరత్ మరోసారి నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇంత మంది కీలకమైన ఆటగాళ్ల మధ్యలో అవకాశం రావడమే ఎక్కువ అయితే.. దాన్ని భరత్ ఇలా నేలపాలు చేయడంపై అభిమానులు మండపడుతున్నారు. భరత్ కన్నా మెరుగైన కీపర్ బ్యాటర్లు మన వద్ద చాలానే ఉన్నారని, వాళ్లందర్నీ కాదని ఇలాంటి ఫెయిల్యూర్కు అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇసాన్ కిషన్కు అవకాశం ఇవ్వొచ్చు కదా అంటున్నారు. కిషన్ వద్దని అనుకుంటే సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. కిషన్, సంజూ వంటి ఆటగాళ్లను ఇలాంటి మ్యాచుల్లో ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.