
కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో టీమిండియా జట్టు ఎంపికపై ఫ్యాన్స్ సంతోషంగా లేరు. అదిరిపోయే ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను బెంచ్కే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిడిలార్డర్లో పంత్ స్థానంలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాలనే కారణంతో సూర్యకుమార్ యాదవ్ను తీసుకోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. దేశవాళీల్లో సూర్య యావరేజ్ చూస్తే అతను ఏమాత్రం టెస్టు ఆటగాడో తెలిసిపోతుందని విమర్శిస్తున్నారు.
అదే సమయంలో మరికొందరు సూర్యకు అవకాశం ఇవ్వడం కరెక్టే కానీ.. దాని కోసం గిల్ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను పక్కన పెట్టాల్సిందని వాదిస్తున్నారు. మ్యాచ్కు ముందు పలువురు మాజీలు కూడా ఫామ్లో లేని రాహుల్ను పక్కన పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. అతను వైస్ కెప్టెన్ అయినా కూడా జట్టుకు ఏది మంచిదో ఆలోచించాలని వాళ్లందరూ చెప్పారు. కానీ ఇవేవీ పట్టించుకోని టీం మేనేజ్మెంట్ మాత్రం రాహుల్ను ఆడిస్తూ గిల్ను పక్కన పెట్టింది. అయితే తొలి రెండు మ్యాచుల్లో రాహుల్కు ఛాన్స్ దక్కుతుందని, కానీ వీటిలో అతను ఫెయిలైతే గిల్ను ఆడించాలంటూ ఫ్యాన్స్ నుంచి వచ్చే ఒత్తిడిని టీమిండియా తట్టుకోవడం కష్టం అవుతుంది. అప్పుడైనా గిల్ను ఆడించక తప్పదని కొందరు మాజీలు ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే.
టీమిండియాలో రాహుల్ను కాపాడినంతగా మరే ఆటగాడినీ ఎన్నడూ కాపాడలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గిల్ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసి కూడా అతన్ని ఎలా పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నారు. టీమిండియా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం బాగలేదంటూ నెట్టింట తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. రాహుల్తో టీమిండియా లవ్ ఎఫైర్ ఉందంటూ కొందరు వెటకారం ఆడుతున్నారు. అసలు ఈ సిరీస్లో గిల్, సూర్యలో ఒకరికే ఛాన్స్ అంటూ వార్తలు రావడానికి కారణం రాహుల్ వైస్ కెప్టెన్ అవడమే అని అంటున్నారు.