
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టులో జరిగిన మార్పులపై అభిమానులు సంతోషంగా లేరు. ఈ మ్యాచులో కేవలం ఒకే ఒక మార్పు చేసినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ను పక్కన పెట్టామని, అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తిరిగి వచ్చాడని చెప్పాడు. దీంతో ఈ మ్యాచులో కూడా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రాహుల్ వస్తారని తేలిపోయింది. ఈ నిర్ణయం మాత్రం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.
సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను జట్టులోకి తీసుకోవాలని ఈ సిరీస్ మొదలవక ముందు నుంచే వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ గతేడాది నుంచి ఏమాత్రం ఫామ్లో లేడు. అదే సమయంలో గిల్ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. ఇటీవలి కాలంలోనే అన్ని ఫార్మాట్లలో శతకాలతో రాణించాడు. దీంతో అతన్నే ఆస్ట్రేలియా టెస్టుల్లో కూడా ఆడించాలని అభిమానులు డిమాండ్ చేశారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం తొలి టెస్టులో రాహుల్కే ఓటేసింది.
కనీసం మిడిలార్డర్లో అయినా గిల్ను ఆడిస్తారని అనుకుంటే.. సూర్యకు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ మ్యాచ్లో కూడా రాహుల్ విఫలమయ్యాడు. తొలి రోజు చివర్లో బ్యాటింగ్కు వచ్చిన అతను.. ఆ రోజు ఆట ముగిసే వరకు కూడా క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతన్ని జట్టులో నుంచి తీసేయాలనే డిమాండ్లు మరింత పెరిగాయి.
అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోని టీం మేనేజ్మెంట్.. రెండో టెస్టులో కూడా అతన్నే ఆడించడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జట్టు ఏమైపోయినా రాహుల్ను మాత్రం ఆడించాలని బీసీసీఐ డిసైడ్ అయిందని విమర్శిస్తున్నారు. ఇంత చెత్తగా ఆడుతున్నా రాహుల్ను ఇంకెంత కాలం ఆడిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ మ్యాచులో అయినా రాణించి, విమర్శకులకు రాహుల్ సమాధానం ఇస్తాడేమో చూడాలి.