
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన అతను.. తనకు దక్కిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఆరంభంలోనే బంగ్లా బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ముగ్గురూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో బంగ్లా ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు తిప్పలు పడ్డారు.
ఈ సమస్యను అధిగమించడానికి టీమిండియా వ్యూాత్మకంగా రిషభ్ పంత్ ను ఐదో స్థానంలో పంపింది. ఈ ప్లాన్ చక్కగా పనిచేసింది. పంత్ తనదైన శైలిలో దనా దన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు పుజారా కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ జోడీ క్రీజులో కుదురుకుంది. దీంతో బంగ్లాదేశ్ బౌలర్లు మరో వికెట్ తీయలేకపోయారు. ఆ తర్వాత టీమిండియా లంచ్ కి వెళ్ళింది. అప్పటికి భారత్ స్కోరు 85/3.
లంచ్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా మంచి స్కోరు చేసేలా కనిపించింది. కానీ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిషభ్ పంత్ అనవసరమైన షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. మెహదీ హాసన్ వేసిన ఆ ఓవర్లో సిక్సర్ బాదిన పంత్.. టెస్ట్ క్రికెట్ లో 50 సిక్సర్లు బాదిన ఆటగాళ్ళ జాబితాలో చేరాడు. ఆ మరుసటి బంతికే రూం తీసుకొని ఆడేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్లను కూల్చింది. దీంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్కోర్ 112 వద్ద పంత్ పెవిలియన్ చేరాడు. పంత్ అవుట్ అవడంతో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో విఫలం అవుతున్న పంత్.. తనకు అచ్చొచ్చిన టెస్ట్ క్రికెట్ లో అయినా భారీ స్కోరు చేస్తాడు అనుకున్న అభిమానులు.. అతను ఇలా అవుట్ అవడంతో నిరాశ చెందారు. పంత్ క్రీజులో ఉంది ఉంటే బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించేవాడు అని కామెంట్లు చేస్తున్నారు.