
నిన్నమొన్నటి దాకా ఆస్ట్రేలియా క్రికెట్లో పెద్దగా ఎవరికీ తెలియని పేరు టాడ్ మర్ఫీ. కానీ ప్రపంచంలో క్రికెట్ అభిమానులందరికీ తెలిసిన పేరు విరాట్ కోహ్లీ. ఇప్పుడు కోహ్లీని వరుసగా మూడు సార్లు అవుట్ చేసిన మర్ఫీ కూడా ఆసీస్లో స్టార్ ప్లేయర్ అయిపోయాడు. కేవలం దేశవాళీల్లో రాణించిన అనుభవంతో భారత పర్యటనకు ఎంపికైన మర్ఫీ.. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. ఢిల్లీలో కూడా ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఇండోర్లో కూడా కోహ్లీని అవుట్ చేశాడు.
మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లంతా తడబడి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అలాంటి సమయంలో కోహ్లీ (22) మాత్రం క్రీజులో కాన్ఫిడెంట్గా కదులుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కీపర్ భరత్ (17)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దేలా కనిపించిన అతన్ని మర్ఫీ అవుట్ చేశాడు. మర్ఫీ వేసిన బంతి కొంచెమైనా టర్న్ అవుతుందని కోహ్లీ అనుకున్నాడు.
కానీ సూటిగా బాణంలా వచ్చిన బంతి అతని ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా కోహ్లీ పెవిలియన్ చేరాడు. అప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కోహ్లీ కూడా అవుటవడంతో ఆరో వికెట్ కూడా కోల్పోయి మరిన్ని కష్టాల్లో పడింది.

విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు ఇలా కొత్త బౌలర్కు వరుసగా ప్రతి మ్యాచులో వికెట్ ఇచ్చుకోవడం అభిమానులకు ఏం నచ్చలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బల్లగుద్ది మరీ చెప్పేశారు. కోహ్లీపై తమ అసహనాన్ని ప్రదర్శించారు. 'చూస్తుంటే మర్ఫీకి కోహ్లీ కోడిపిల్లలా దొరికేసినట్లున్నాడు' అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. బ్యాటింగ్ చేసిన నాలుగు ఇన్నింగ్సుల్లో మూడింట్లో మర్ఫీకే వికెట్ ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా మళ్లీ భారీ స్కోరు చెయ్యలేకపోయాడని కోహ్లీని విమర్శిస్తున్నారు. మరి రెండో ఇన్నింగ్సులో అయినా కోహ్లీ రాణిస్తాడేమో చూడాలి.