
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అదరగొడుతున్నాడు. టీమిండియా టాపార్డర్ మొత్తాన్ని అతనే కూల్చాడు. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే కేఎల్ రాహుల్ (17) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అతను అవుటవడంతో అభిమానులు మరోసారి రాహుల్పై మండిపడ్డారు. జట్టులో ఒక స్థానం వేస్ట్ చేయడానికే అతన్ని తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ అవుటవడాన్ని మర్చిపోయేలోపే తన కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న ఛటేశ్వర్ పుజారా (0) కూడా అవుటయ్యాడు. అతను కూడా లియాన్ బౌలింగ్లోనే ఎల్బీగా వెనుతిరిగాడు. అతను ఇలా డకౌట్ అవడం చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (32) కూడా లియాన్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటి వరకు కోహ్లీ, జడ్డూ భారత్ను ఆదుకున్నారు. వీళ్లు అవుటైన తర్వాత మళ్లీ లియాన్ బౌలింగ్లోనే కేఎస్ భరత్ (6) పెవిలియన్ చేరాడు. ఇలా లియాన్ బౌలింగ్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంతా అతలాకుతలం అవడం చూసిన అభిమానులు చిరాకు పడుతున్నారు. ఈ సమయంలో రిషభ్ పంత్ ఉండి ఉంటే లియాన్కు చుక్కలు చూపించేవాడని అంటున్నారు. ఆసీస్తో ఆడిన ప్రతి మ్యాచులోనూ లియాన్ బౌలింగ్లో పంత్ చెలరేగాడు.

లియాన్ బౌలింగ్కు వస్తే చాలు భారీ షాట్లు ఆడుతూ అతన్ని కుదురుకోనిచ్చే వాడు కాదు పంత్. ఇప్పుడు లియాన్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగడంతో పంత్ను మిస్ అవుతున్నామని అంతా అంటున్నారు. పంత్ లేని లోటును టెస్టు టీంలో మరెవరూ తీర్చలేరని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్, అక్షర్ ఉన్నారు. ఇంకా ఆసీస్ చేసిన స్కోరును భారత్ అందుకోలేదు. ఈ క్రమంలో అశ్విన్, అక్షర్ జోడీపై భారం పడనుంది. వీళ్లిద్దరూ కూడా రాణించకపోతే టీమిండియాకు ఫాలో ఆన్ గండం తప్పేలా లేదు.