India vs England: ఏం మాట్లాడుతున్నావ్ మాంటీ.. కుక్తో సచిన్కు పోలికా?! ఏ ఇంగ్లీష్ ప్లేయర్ సాటిరాడు!!

హైదరాబాద్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. 'ఏం మాట్లాడుతున్నావ్ మాంటీ', 'కుక్తో సచిన్కు పోలికా', 'నువ్ ఓ అవకాశవాదివి' అంటూ మండిపడుతున్నారు. మాంటీపై ఫాన్స్ ఇంతలా మండిపడడానికి కారణం మాత్రం అతడు చేసిన ట్వీటే. భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు 'సచిన్ టెండూల్కర్-అలిస్టర్ కుక్ ట్రోఫీ'గా నామకరణం చేస్తే బాగుంటుందని డిమాండ్ చేశాడు. ఆయా జట్ల తరఫున వారిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్లు అని పేర్కొన్నాడు. ఇదే అతడి కొంప ముంచింది.
దిగ్గజాల పేరుతో పలు టోర్నీలు
అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజాల పేరుతో పలు టోర్నీలు జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్-ఆస్ట్రేలియా సిరీసులను 'బోర్డర్-గవాస్కర్' పేరుతో ఇప్పటికే నిర్వహిస్తున్నారు. టీమిండియా.. ఇంగ్లండ్లో పర్యటిస్తున్నప్పుడు పటౌడీ టోర్నీగా వర్ణిస్తారు. మహాత్మా గాంధీ గౌరవార్థం భారత్-దక్షిణాఫ్రికా సిరీసులను 'ఫ్రీడమ్ సిరీస్'లుగా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ పేరుతోనూ ఒక ట్రోఫీ ఉంటే బాగుంటుందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

'సచిన్-కుక్ ట్రోఫీ' బాగుంటుంది
'భారత్-ఇంగ్లండ్ సిరీసులకు 'సచిన్ టెండూల్కర్-అలిస్టర్ కుక్ ట్రోఫీ'గా నామకరణం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే.. ఆయా దేశాల తరఫున వారు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేశారు. వారిద్దరూ ప్రత్యర్థులుగా ఎక్కువగా తలపడ్డారు. ఇక సచిన్ టెండూల్కర్ ఓ క్రికెట్ లెజెండ్ అని మనకు తెలిసిందే. అయితే అతడి పేరుతో ఒక్క సిరీసూ లేదు. భారత్-ఇంగ్లండ్ సిరీసులకు అతడి పేరు పెడితే బాగుంటుంది' అని పనేసర్ ట్వీటాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అతడికి అభిమానులు కొన్ని సూచనలు చేశారు. కొందరు చురకలు అంటిస్తున్నారు.

'ఏం మాట్లాడుతున్నావ్ మాంటీ
సోషల్ మీడియాలో మాంటీ పనేసర్కు పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 'బోథమ్-కపిల్ ట్రోఫీ' ఎందుకు కాకూడదు అని ఒక నెటిజన్ అడగ్గా.. 'మరో రెండు మూడేళ్లు ఆగితే అది కోహ్లీ-రూట్ ట్రోఫీ అవుతుంది' అని మరొకరు బదులిచ్చారు. 'భజ్జీ-పనేసర్ ట్రోఫీ ఎందుకు కావొద్దు' అని ఒకరు ప్రశ్నించగా.. 'టెస్టుల్లో నేను 300+ వికెట్లు తీసుకుంటే హర్భజన్-పనేసర్ ట్రోఫీ ఉండేది' అని మాంటీ బదులిచ్చాడు. 'ఏం మాట్లాడుతున్నావ్ మాంటీ', 'కుక్తో సచిన్కు పోలికా?! ఏ ఇంగ్లీష్ ప్లేయర్ భారత దిగ్గజంకు సాటిరాడు' అని ఇంకొందరు మండిపడుతున్నారు. ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు ఆడిన మాంటీ 167 వికెట్లు తీశాడు.

రహానే అద్భుత ప్రదర్శన చేశాడు
విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్ సరిగ్గా ఆడలేకపోతోందని మాంటీ పేర్కొన్న విషయం తెలిసిందే. 'ఆల్టైమ్ అత్యుత్తమ బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ ఒకడు. కానీ అతడి నేతృత్వంలో భారత్ సరిగ్గా ఆడటం లేదనిపిస్తోంది. కోహ్లీ కెప్టెన్సీలో గత నాలుగు టెస్టుల్లోనూ భారత్ ఓడిపోవడం చూశాం. అదే సమయంలో కెప్టెన్గా అజింక్య రహానే అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి కోహ్లీ ఇప్పుడు మరింత ఒత్తిడికి గురవుతుంటాడు. తర్వాతి మ్యాచ్లోనూ భారత జట్టు ఓటమిపాలైతే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమో' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications