
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చాడు. బుధవారం నాడు బర్త్ డే జరుపుకుంటున్న అతను జట్టులో ఉన్నట్లు టాస్ సందర్భంగా కేఎల్ రాహుల్ వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొంతకాలం క్రితం గాయం, ఆ తర్వాత ఫామ్ లేమితో జట్టుకు దూరమైన కుల్దీప్.. పునరాగమనంలో అదరగొడుతున్నాడు.
తను ఆడిన ప్రతి మ్యాచులోనూ బంతితో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి జట్టులో చోటు దక్కాలని చాలా మంది కోరుకున్నారు. కానీ బంగ్లా సిరీస్కు అతన్ని ఎంపిక చేయలేదు. మూడో వన్డే కోసం అతన్ని ఎంపిక చేయగా.. ఆ వన్డేలో కూడా రాహుల్ అతన్ని ఆడించాడు. ఆ మ్యాచ్లో కుల్దీప్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో టెస్టు సిరీస్లో అతనికి చోటు దక్కడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగాలని అనుకున్న రాహుల్.. కుల్దీప్ కూడా ఆడుతున్నట్లు ప్రకటించాడు.
కుల్దీప్కు చాలా కాలం తర్వాత ఇలా టెస్టు టీంలో చోటు దక్కడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'బర్త్ డే బాయ్ రీస్టార్ట్ టెస్ట్' అంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. కుల్దీప్ ఈ మ్యాచ్లో రాణించాలని కోరుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తాము ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలో దిగుతున్నట్లు రాహుల్ చెప్పాడు. అయితే బ్యాటింగ్లో జట్టుకు శుభారంభం దక్కలేదు. టాపార్డర్లో శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ముగ్గురూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో మిడిల్, లోయర్ మిడిలార్డర్పై మరింత భారం పడింది. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.