ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఫ్యాన్స్ అందరికీ షాకిచ్చిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు అజింక్య రహానే. చాలాకాలంగా ఐపీఎల్ ఆడుతున్న అతను.. విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడింది చాలా తక్కువ. ఇన్నింగ్స్ నిర్మించడమే తన పనిగా పెట్టుకునే వాడు. కానీ ఈసారి సీఎస్కు తరఫున అతను తన ఆటతీరునే మార్చేశాడు.
క్రీజులో వచ్చినప్పటి నుంచే ఎడాపెడా బౌండరీలు బాదేస్తున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా ..ఇతను మాకు తెలిసిన రహానే అంటే ఎలా నమ్మాలి? అని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ వెన్నుగాయంతో జట్టుకు దూరం అవడంతో టీమిండియాలో కీలకమైన మిడిలార్డర్ ప్లేయర్ కరువయ్యాడు. టెస్టుల్లో పనికిరాడని సూర్యకుమార్ ఆటతీరు చూసిన వాళ్లంతా ముక్తకంఠంతో చెప్పారు.

ఇక వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడినపుడు కూడా సూర్యకుమార్ దారుణంగా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు శ్రేయాస్ దూరమయ్యాడు. అతని స్థానాన్ని భర్తీ చేసే మిడిలార్డర్ ప్లేయర్ కోసం సెలెక్టర్లు వెతకడం మొదలు పెట్టారు. సర్ఫరాజ్ ఖాన్ పేరు వినిపించినా అతను ఇంగ్లండ్లో ఇప్పటి వరకు ఆడలేదు కదా.
అందుకే అనుభవాన్ని నమ్ముకున్న సెలెక్టర్లు మరో ఆలోచన లేకుండా అజింక్య రహానేను ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో ఆడిన అనుభవంతోపాటు అక్కడ రహానే రికార్డు కూడా మెరుగ్గా ఉండటమే దీనికి కారణం అని తెలుస్తోంది. దీంతో టీమిండియా మిడిలార్డర్ మళ్లీ బలంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక చేసే బృందంలో తాము చూడాలని అనుకున్న పేరు ఇదే అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ పేరు వినడానికి ఎంత వెయిట్ చేశామో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జూన్ నెలలో ఇంగ్లండ్లోని ది ఓవల్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇంగ్లండ్లోనే జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడిపోయి, రన్నరప్తో సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు కీలక ప్లేయర్లు ఫామ్లో ఉండటంతో ఎలాగైనా డబ్ల్యూటీసీ ఫైనల్ నెగ్గాలని అనుకుంటోంది. ఈ క్రమంలో రహానేను జట్టులోకి తీసుకున్నందుకు ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.