రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు చిత్తుగా ఓడింది. అయినా సరే బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పోరాటం అందరిలో స్ఫూర్తి నింపింది. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత అతను వచ్చాడు. కాసేపటికే హార్దిక్ పాండ్యా కూడా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు వాషీ. వచ్చీ రావడంతోనే తొలి బంతికే రివర్స్ స్వీప్ ఆడాడు. అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు.
తనకు దక్కిన ప్రతి బంతిని బౌండరీ దాటించేందుకు ప్రయత్నించాడు. మ్యాచ్ చివరి వరకు భారత్ను గెలిపించేందుకు ట్రై చేశాడు. కానీ అతనికి మరో ఎండ్ నుంచి సహకారం అందలేదు. పాండ్యా అవుటైన తర్వాత వచ్చిన దీపక్ హుడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. స్పెషలిస్టు బ్యాటర్ అయిన అతను కూడా కివీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయాడు. క్రీజులో కుదురుకోవడానికి టైం తీసుకున్న అతను.. 10 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు. అయితే ఆ తర్వాత బ్యాటు ఝుళిపిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు.
ఈ క్రమంలో కివీస్తో వాషింగ్టన్ ఒంటరి పోరాటం చేశాడు. అంతకుముందు బౌలింగ్లో కూడా వాషీ చక్కగా రాణించాడు. మిగతా బౌలర్లను దంచికొడుతున్న ఫిన్ అలెన్ను అవుట్ చేశాడు. అలాగే మార్క్ చాప్మాన్ను కూడా స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్లో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ చివరకు 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేక పోయాడు.
ఇదంతా చూసిన వాళ్లు ఈ మ్యాచ్ భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగినట్లు కాకుండా.. వాషింగ్టన్ సుందర్, న్యూజిల్యాండ్ మధ్య జరిగినట్లు అనిపించిందని అనడం తెలిసిందే. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్ను నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 'మ్యాచ్ ఓడినా మనకు దొరికిన వజ్రం వాషింగ్టన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడేంట్రా? అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ మ్యాచ్లో అతనొక్కడే భారత్కు పాజిటివ్ అని కొనియాడుతున్నారు.