
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత జట్టు అద్భుతంగా ఆడింది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి టెస్టు సిరీసును దాదాపుగా తన ఖాతాలో వేసుకుంది. మిగతా రెండు మ్యాచుల్లో అనూహ్యం జరిగి ఆస్ట్రేలియా గెలిస్తే తప్ప ఈ సిరీస్ భారత్దే. ఈ క్రమంలోనే టీమిండియా ఆటతీరుపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఆటతీరును కూడా అందరూ మెచ్చుకుంటున్నారు.
సాధారణంగా జడేజా తర్వాత బ్యాటింగ్కు వచ్చే భరత్ను ఈ మ్యాచులో కోహ్లీ అవుటవగానే క్రీజులోకి పంపారు. అది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. భరత్ను అప్పుడే పంపడం ఏంటని ప్రశ్నించారు. కానీ ఈ ఆలోచన చాలా చక్కగా పారింది. వచ్చీ రావడంతోనే చూడచక్కని షాట్లతో అలరించిన భరత్.. చాలా వేగంగా ఆడాడు. అతనితోపాటు పుజారా (31 నాటౌట్) కూడా రాణించాడు. వీళ్లిద్దరూ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగారు. ఈ క్రమంలో భరత్ 22 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో భరత్ మూడు ఫోర్లు, సిక్సర్తో ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్ చూసిన అభిమానులు నెట్టింట భరత్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
పంత్ స్థాయి అందుకోవడం భరత్కు అప్పుడే కష్టం అని అంటున్నప్పటికీ.. పంత్ కన్నా ముందే దేశవాళీల్లో భరత్ రాణించాడనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. పంత్కు అసలు గుర్తింపు రాకముందే భరత్ దేశవాళీల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయాన్ని చెప్తున్నారు. భరత్ ఆడిన ఇన్నింగ్స్లో చూడచక్కని కవర్ డ్రైవ్లు, లాఫ్టెడ్ షాట్లు ఉన్నాయి. అతని కామియో ఇన్నింగ్స్ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్న అభిమానులు.. తొలి టెస్టులో విఫలమయ్యాడనో, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆడలేదనో భరత్ మీద ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదని అంటున్నారు. భరత్ చాలా సత్తా ఉన్న ఆటగాడని మెచ్చుకుంటున్నారు.