ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ చూపిన పట్టుదలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అతను మైదానంలోకి రాగానే అందరూ నిలబడి స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. అతనే ఆసీస్ ప్లేయర్ నాథన్ లియాన్. ఈ టెస్టు మ్యాచ్ రెండో రోజున లియాన్ గాయపడ్డాడు. దీంతో మూడో రోజు ఉదయం స్టేడియానికి వచ్చేప్పుడు.. చేతికర్రల సాయంతో నడుస్తూ కనిపించాడీ స్పిన్నర్.
దీంతో అతను మిగతా మ్యాచ్లో అసలు మైదానంలోకి వస్తాడా? అని చాలా మంది అనుమానించారు. అయితే నాలుగో రోజు ఆటలో బ్యాటర్లు అందరూ పెవిలియన్ చేరుతున్న క్రమంలో.. చివర్లో లియాన్ బ్యాటు తీసుకొని మైదానంలోకి వచ్చాడు. కాలు నొప్పితో సరిగా నడవలేకపోయిన అతను.. కుంటుకుంటూనే క్రీజులోకి వచ్చాడు. కనీసం బ్యాటర్ స్టాన్స్లో కూడా సరిగా నిలబడలేకపోయాడు.

అంత బాధలో కూడా లియాన్ అంత పట్టుదలగా జట్టు కోసం బరిలో దిగడం చూసిన ఆసీస్ ఫ్యాన్స్.. అతని ధైర్యానికి ఫిదా అయిపోయారు. లియాన్ మైదానంలోకి రావడం చూసిన వాళ్లు అందరూ తమ తమ సీట్లలో నిలబడి మరీ అతనికి గౌరవం ఇచ్చారు. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన లియాన్ కూడా ఈ జట్టు తనకు ప్రాణంతో సమానమని, దీని కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని చెప్పి మనసులు గెలుచుకున్నాడు.
'ఈ గాయం తర్వాత నా మనసు ముక్కలైంది. బాగా ఏడ్చా. నొప్పితోపాటు బాగా అప్సెట్ అయ్యా. ఈ జట్టు నాకు ప్రాణం. ఇప్పటి నుంచి కోలుకోవడంపై ఫోకస్ పెడతాను. నాకు ఇష్టమైన ఈ ఆట, ఈ జట్టులో నా పాత్ర మళ్లీ పోషించడానికి రెడీ అవుతాను' అని లియాన్ చెప్పాడు. గాయంతో మైదానంలో దిగితే ఉండే రిస్కులు తనకు తెలుసునని, కానీ ఈ టీం కోసం తను ఏం చేయడానికైనా సిద్ధమని అన్నాడు.
'యాషెస్ సిరీస్లో 15 పరుగుల భాగస్వామ్యం ఎంత కీలకంగా మారుతుందో చెప్పలేం. అందుకే ఈ రోజు మైదానంలోకి వెళ్లి ఆడినందుకు చాలా గర్వంగా ఉంది. రేపు మళ్లీ ఇలాంటి ఘటనే జరిగితే.. నేను మళ్లీ ఇదే పని చేస్తా' అని లియాన్ స్పష్టం చేశాడు. ఈ టెస్టు రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా లియాన్ కాలికి గాయమైంది. అతని పిక్క బాగా దెబ్బతిన్నది. దీంతో మైదానం వీడిన అతను.. నాలుగో రోజు బ్యాటింగ్కు మాత్రమే క్రీజులోకి వచ్చాడు.