హైదరాబాద్: వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులోకి తీసుకోవడం పట్ల బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దినేష్ కార్తీక్ను ఎంపిక చేయడం ఏంటి? గంభీర్, రైనాలను ఎందుకు పక్కనపెట్టారు? అంటూ ట్విటర్లో అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్టర్లు పదిహేను మంది సభ్యులతో కూడిన టీమిండియాను ఎంపిక చేసినప్పుడు కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫామ్లో ఉన్న గంభీర్ను కాదని, శిఖర్ ధావన్ను ఎంపిక చేయడాన్ని అభిమానులు తప్పుబట్టారు.
ఇప్పుడు తాజాగా మనీష్పాండే గాయపడితే అతని స్థానంలో గంభీర్ను ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే అతనికి సెలక్టర్లు మరోసారి అతడిని విస్మరించారు. మనీష్ స్థానంలో ఎవరూ ఊహించని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ను ఎంపిక చేశారు. దీనిపై ట్విట్టర్లో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న మనీశ్ పాండే సన్రైజర్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో పక్కటెముక గాయంతో ఇబ్బంది పడ్డాడు. తాజాగా గాయం పెద్దది కావడంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తొలగించారు. అతడి స్థానంలో స్టాండ్బై ఆటగాడు దినేశ్ను జట్టులోకి తీసుకున్నారు.
ఐపీఎల్ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకొని ఆటగాళ్లను ఎంపిక చేయమన్న సెలక్టర్లు ఇప్పుడు దినేశ్ కార్తీక్ని ఎందుకు తీసుకున్నారంటూ ట్విటర్లో విమర్శలు చేస్తున్నారు. గుజరాత్ లయన్స్కు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. 14 మ్యాచ్ల్లో 36.10 సగటుతో 361 పరుగులు చేశాడు.