
తొలి టెస్టులో కూడా..
నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా రోహిత్ తన క్లాస్ చూపించాడు. ప్రత్యర్థి బ్యాటర్లతోపాటు భారత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్న పిచ్పై అతను మాత్రం చెలరేగాడు. ఏకంగా 120 పరుగులు బాది భారత జట్టుకు భారీ స్కోరు అందించాడు. అనంతరం అశ్విన్, జడ్డూలను చక్కగా ఉపయోగించుకొని ఆసీస్ను చిత్తు చేశాడు. దీంతో ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదే జోరు కొనసాగించిన రోహిత్ రెండో టెస్టులో కూడా ఇన్నింగ్స్ను ధైర్యంగా ఆరంభించాడు.

టీ20 తరహా బ్యాటింగ్..
ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో రోహిత్ వేగంగా ఆడాడు. అయితే లియాన్ బౌలింగ్లో బంతిని సరిగా జడ్జ్ చేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ అవడంతో మళ్లీ బరిలో దిగిన రోహిత్ తన ఇన్నింగ్స్ను చక్కగా ప్రారంభించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో కేవలం 20 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. టీ20 తరహా బ్యాటింగ్తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే పుజారాతో కలిసి బ్యాటింగ్ చేస్తుండగా జరిగిన పొరపాటుతో రనౌట్ అయ్యాడు.

పుజారా కోసం త్యాగం..
రోహిత్, పుజారా చక్కగా బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చేలా కనిపించారు. కానీ మధ్యలో రెండు పరుగులు తీసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. రెండో పరుగు కోసం పుజారా వచ్చేస్తుండగా.. ఆ పరుగు పూర్తి చేయడం కుదరదని రోహిత్కు అర్థమైపోయింది. అయినా సరే పుజారాకు ఇది 100వ టెస్టు. తన కెరీర్లో ఇంత ముఖ్యమైన మ్యాచ్లో పుజారాను రనౌట్ చేయడం ఇష్టం లేకపోవడంతో తన వికెట్ను రోహిత్ త్యాగం చేశాడు. ఇది చూసిన అభిమానులు 'సూపర్ కెప్టెన్' అంటూ అతన్ని మెచ్చుకున్నారు.

పెద్దమనసు చాటుకున్నాడుగా..
అంతేకాదు మ్యాచ్ చివరి దశకు చేరుకున్నప్పుడు కూడా పుజారాకు రోహిత్ మద్దతు ఇచ్చాడు. అప్పటికి కేఎస్ భరత్, పుజారా క్రీజులో ఉన్నారు. భరత్ మంచి జోరు మీద ఉన్నాడు. ధనాధన్ షాట్లతో వేగంగా ఆడుతున్నాడు. అయితే మ్యాచ్ గెలిపించే అవకాశం మాత్రం పుజారాకు ఇవ్వాలని రోహిత్ సూచించాడు. ఇలా అతని వందో టెస్టును పుజారాకు స్పెషల్ అనుభవం చేయాలని కోరుకున్నాడు. అతని ఆలోచన అర్థం చేసుకున్న భరత్ కూడా తన కెప్టెన్ చెప్పినట్లే.. జట్టును గెలిపించే అవకాశాన్ని పుజారాకు అందించాడు. అనంతరం మ్యాచ్ గెలిచిన తర్వాత పుజారాను నవ్వుతూ కౌగిలించుకున్నాడు. ఇదంతా చూసిన అభిమానులు రోహిత్ పెద్దమనసుకు ఫిదా అయిపోయారు.


Click it and Unblock the Notifications












