DC VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా దిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా తాజాగా జరిగిన కీలక మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆర్సీబీలో బ్యాటుతో కోహ్లీ(51), కృనాల్ పాండ్య (73), బంతితో భువనేశ్వర్ కుమార్, హెజిల్ వుడ్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ చేసిన రెండి తప్పిదాలు.. క్రికెట్ అభిమానులను ఆగ్రహానికి గురి చేశారు. దీంతో వారు కోహ్లీని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?
కోహ్లీ మొదటి తప్పిదం..
మైదానంలో చురుగ్గా కదులుతూ ఆడే విరాట్ కోహ్లీ.. అప్పుడప్పుడూ ఫీల్డింగ్ లో తప్పిదాలు కూడా చేస్తుంటాడు. తాజాగా మ్యాచులో కోహ్లీ చేసిన ఓ ఫీల్డింగ్ మిస్టేక్ దిల్లీ క్యాపిటల్స్ కు అదనపు పరుగుల రూపంలో కలిసొచ్చింది. 19వ ఓవర్ లో యశ్ దయాల్ సంధించిన మొదటి బంతిని.. విప్రాజ్ నిగమ్ ఎక్స్ట్రా కవర్ మీదగా ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేసిన రజత్ పటీదార్ బంతిని పట్టుకుని, బౌలర్ ఎండ్ వైపు ట్రిస్టన్ స్టబ్స్ను రనౌట్ చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అప్పుడే నిగమ్ పరుగు తీసేందుకు నిరాకరించాడు. కానీ పటీదార్ కు డైరెక్ట్ హిట్ మిస్ అయ్యింది. అప్పుడే కోహ్లీ ఉత్సాహంతో బంతి వైపు పరిగెత్తాడు కానీ బాల్ను పట్టుకోలేకపోయాడు. బంతి కాస్త బౌండరీకి వెళ్లిపోయింది.
కోహ్లీ చేసిన ఈ తప్పిదంతో దిల్లీ క్యాపిటల్స్కు నాలుగు అదనపు పరుగులు వచ్చాయి. ఇది ఆట మోమెంటమ్ ను కాస్త మార్చింది. ఫలితంగా డెత్ ఓవర్లో విప్రాజ్ నిగమ్, ట్రిస్టన్ స్టబ్స్ కీలక పరుగులు చేశారు. దీంతో దిల్లీ 162 పరుగులు చేయగలిగింది. అందుకే కోహ్లీ ఫీల్డింగ్ మిస్టేక్ చేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కోహ్లీ రెండో తప్పిదం..
విరాట్ కోహ్లీ మరోసారి తన సొంత టీమ్ మేట్ ప్లేయర్ రనౌట్ అవ్వడౌనికి కారణమయ్యాడు. ఫలితంగా క్రికెట్ అభిమానులు కోహ్లీపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన ఆర్సీబీ ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్లో జరిగింది. ముకేశ్ కుమార్ వేసిన నాలుగో ఓవర్ చివరి బంతిని కోహ్లీ మిడ్-వికెట్ దిశగా ఫ్లిక్ చేశాడు. అయితే అదే సమయంలో, రజత్ పటీదార్ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ కోహ్లీ అతడిని ఆలస్యంగా వారించాడు. దీంతో క్రీజు దాటిన పటీదార్ మళ్లీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది.
కానీ పటీదార్ క్రీజులోకి చేరుకునే లోపే మిడ్ వికెట్లో ఉన్న కరుణ్ నాయర్ మెరుపు వేగంతో బంతిని అందుకుని స్టంప్స్ పైకి డైరెక్ట్ త్రో విసిరాడు. అతడు విసిరిన వేగానికి బంతి స్టంప్స్ కు తగిలి బౌండరీ వరకు వెళ్లింది. దీంతో పటీదార్ రనౌట్ గా వెనుదిరగడానికి కోహ్లీ కారణమయ్యాడు. పైగా ఆర్సీబీ ఇన్నింగ్స్పై ఈ రనౌట్ మరింత ఒత్తిడిని తీసుకొచ్చింది. అందుకే క్రికెట్ అభిమానులు కోహ్లీని మీమ్స్, ట్రోల్స్ రూపంలో విమర్శిస్తున్నారు.
