
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో తన ఫామ్ను చాటాడు. టెస్టుల్లో మూడున్నరేళ్లుగా శతకం లేని కరువును 186 పరుగుల భారీ స్కోరుతో తీర్చాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడంకెల స్కోరు సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేసినప్పుడు ఆస్ట్రేలియా జట్టు సభ్యులు కూడా చప్పట్లు కొడుతూ కోహ్లీని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కొన్నేళ్ల క్రితం టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆస్ట్రేలియాపై ఇలాగే సెంచరీ చేశాడు. అప్పట్లో సచిన్, ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ మధ్య కూడా అద్భుతమైన రైవలరీ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు క్లాస్ ప్లేయర్లు ఒకరి ట్యాలెంట్ను మరొకరు కూడా గుర్తించిన వారే. అందుకే కోహ్లీ సెంచరీ చేస్తే పాంటింగ్ కూడా చప్పట్లు కొట్టి అభినందించేవాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇప్పుడు అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ కూడా చాలా గ్యాప్ తర్వాత సెంచరీ చేశాడు. ఈ సమయంలో ఆసీస్ కెప్టెన్, సూపర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా చప్పట్లు కొట్టి అభినందించాడు.
అప్పట్లో సచిన్ సెంచరీ సెలబ్రేషన్స్లో పాంటింగ్ ఎలాగైతే బ్యాక్గ్రౌండ్లో చప్పట్లు కొడుతూ కనిపించాడో.. ఇప్పుడు కోహ్లీ సెలబ్రేషన్స్ టైంలో స్మిత్ కూడా బ్యాక్గ్రౌండ్లో కనిపించాడు. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్ తమకు ఆ రోజులు గుర్తొస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియాపై తన కెరీర్ బెస్ట్ స్కోర్ బాదిన కోహ్లీ తనదైన స్టైల్లో పునరాగమనాన్ని చాటుకోవడంతో ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు కూడా. మా కింగ్ మళ్లీ తన రాజ్యాన్ని ఏలుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో గ్రేట్ ప్లేయర్ మళ్లీ తిరిగొచ్చాడంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.