
భారత్లో టెస్టు సిరీస్ మొదలైందో లేదో.. ఇక్కడి పిచ్ల గురించి ఆస్ట్రేలియా మాజీలు, మీడియా సంస్థలు తెగ వార్తలు రాసేశారు. బీసీసీఐ కావాలనే చెత్త పిచ్లు తయారు చేసి తమను ఓడించేందుకు కుట్రలు పన్నుతోందనే తరహాలో ఆరోపణలు చేశారు. ఇక నాగ్పూర్ పిచ్ ఫొటోలు బయటకు వచ్చినప్పుడు అయితే మరో అడుగు ముందుకేసి.. ఇక్కడి క్యురేటర్ కావాలని లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టే పిచ్ తయారు చేశాడని మండిపడ్డారు. ఇన్ని చేసినా కూడా ఆ మ్యాచ్లో భారత తడబడలేదు. అద్భుతంగా రాణించి విజయం సాధించింది.
అదే మ్యాచులో సిరాజ్ నుంచి పెయిన్ రిలీఫ్ జెల్ తీసుకున్న జడ్డూ.. బౌలింగ్ చేసే ముందు దాన్ని తన వేలికి పూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆసీస్ మీడియా.. అతను బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు కూడా ఆరోపణలు చేసింది. దీనికి భారత క్రీడాభిమానులు కూడా గట్టిగానే బదులిచ్చారు. చివరకు అది పెయిన్ రిలీఫ్ జెల్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. దీంతో అంపైర్లు సంతృప్తి చెందారు. కానీ తమకు ముందుగా సమాచారం ఇవ్వని కారణంగా జడ్డూకు మ్యాచ్ ఫీజులో కొంత కోత విధించారు.
ఇలా తొలి టెస్టు సమయంలో భారత జట్టుపై ఆస్ట్రేలియా వాళ్లు చేసిన ఆరోపణలు భారత అభిమానులు ఏమాత్రం మర్చిపోలేదు. అందుకే ఢిల్లీలో ఆసీస్ ఆటగాళ్లు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటే.. 'శాండ్ పేపర్.. శాండ్ పేపర్..' అంటూ నినాదాలు చేస్తూ ఎగతాళి చేశారు. గతంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా మ్యాచ్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా జట్టు బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు పొక్కడంతో డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ తదితరులపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిషేధం కూడా విధించింది. దీన్నే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని ప్రేక్షకులు గుర్తుచేశారు.