
హైదరాబాద్: అటు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, ఇటు భారత జట్టుకు చిన్నస్వామి స్టేడియం ఏ మాత్రం కలిసిరాలేదు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను టీ20ల్లో ఓడించడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ను కూడా టీమిండియా చేజార్చుకుంది. ఆదివారం టీమిండియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో టీ20లో సఫారీలు విజయం సాధించడంతో భారత్లో దక్షిణాఫ్రికా తన రికార్డుని మరింత పదిలం చేసుకుంది.
సొంతగడ్డపై టీమిండియా ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై టీ20ల్లో సిరిస్ను గెలవలేదు. మూడో టీ20లో 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మరో 19 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించడం విశేషం. సాధారణంగా టీమిండియా మ్యాచ్లు జరుగుతుంటే అభిమానులు ఇండియా-ఇండియా అంటూ ఆటగాళ్లను ఉత్తేజపరచడాన్ని మనం చూశాం.
కానీ, ఆదివారం నాటి మ్యాచ్లో అందుకు భిన్నంగా స్టేడియంలోని అభిమానులు ఆశ్చర్యకంగా 'RCB-RCB' అంటూ పెద్ద ఎత్తున అరిచారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఓ ప్రాంఛైజీ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ జట్టు కెప్టెన్... టీమిండియా కెప్టెన్ కోహ్లీనే కావడం విశేషం.
దీంతో ప్రేక్షకులు 'RCB-RCB' అని అరుస్తూ స్టేడియం మొత్తాన్ని హోరెత్తించారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. అయితే, కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవని సంగతి తెలిసిందే.