
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మళ్లీ గాడిన పడినట్లే కనిపిస్తున్నాడు. గతేడాది చివర్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫామ్ అందుకున్న కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం గాడిన పడలేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు మ్యాచుల్లో చక్కగా ఆడినా కూడా భారీ స్కోరు మాత్రం చేయలేకపోయాడు. అలాంటి సమయంలో నాలుగో టెస్టులో బ్యాటింగ్ పిచ్ ఉండటంతో చాలా మంది కోహ్లీ సెంచరీ చేస్తాడని ఆశించారు.
మూడో రోజు బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ కూడా మంచి టచ్లో కనిపించాడు. అద్భుతంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో రోజు ఆట మొదలైన తర్వాత కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ చూపించిన కోహ్లీ.. చాలా నిలకడగా ఆడాడు. అతను ఎంత డెడికేషన్ చూపించాడంటే.. తన సెంచరీ పూర్తయ్యే వరకు ఒక్కటంటే ఒక్క బౌండరీ కొట్టలేదు. కేవలం సింగిల్స్, డబుల్స్ మీదనే ఆధార పడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవతలి ఎండ్లో జడేజా, భరత్ అవుటైనా కూడా కోహ్లీ మాత్రం ఎక్కడా తొందరపడలేదు.
ద్రావిడ్ నుంచి నేర్చుకున్నాడా? అనేలా అద్భుతమైన డిఫెన్స్తో క్రీజులో పాతుకుపోయిన అతను.. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా మరోసారి తన మెడలో ఉండే పెళ్లి ఉంగరాన్ని ముద్దుపెట్టుకొని భార్య అనుష్కను గుర్తుచేసుకున్నాడు. దీంతో అతని సెంచరీ కోసం 1025 రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ తీరింది.
మూడున్నరేళ్ల తర్వాత కోహ్లీ టెస్టు శతకం సాధించాడు. ఇది అతనికి టెస్టుల్లో 48వ సెంచరీ కాగా.. ఓవరాల్గా 75వ అంతర్జాతీయ సెంచరీ. ఈ సెంచరీతో సచిన్ వంద సెంచరీల రికార్డుకు అతను మరింత చేరువయ్యాడు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లకు తమ కోరిక తీరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.